తెలంగాణ కాంగ్రెస్ లో పవన్ చిచ్చు.. రేవంత్ ని టార్గెట్ చేశారు!!

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆయన ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు వెళ్లడం.. కొంత మంది కాంగ్రెస్ నేతలకు నచ్చలేదు. ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ.. పవన్ సమావేశానికి వెళ్లిన రేవంత్ రెడ్డి సహా పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ.. హైకమాండ్ కు ఫిర్యాదుల పరంపర ప్రారంభమైంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా సమక్షంలో.. దీనిపై పెద్ద రచ్చే జరిగింది.

ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.. రేవంత్ రెడ్డిపై విమర్శలకు..ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఉపయోగించుకున్నట్లుగా తెలుస్తోంది. యురేనియం అంశాన్ని తెర మీదకు తెచ్చింది కాంగ్రెస్ అని, పవన్ కు సంబంధం ఏంటని సంపత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ వెళ్లి జనసేన ఫ్లాగ్ కింద కూర్చోవడం ద్వారా.. ఎలాంటి సంకేతాలు పంపించాలని అనుకుంటున్నారంటూ నేతలను నిలదీశారు. మన పార్టీ పిలిచినప్పుడు పవన్ రాలేదని గుర్తు చేశారు. సీనియర్ నేతలంతా వెళ్లి పవన్ దగ్గర కూర్చోవడం ఏంటని సంపత్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సంపత్ అభిప్రాయంతో కుంతియా కూడా ఏకీభవించడంతో.. జనసేన అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం తప్పేనని సీనియర్ నేతలు అంగీకరించినట్టు తెలుస్తోంది. మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ హామీ ఇచ్చేశారు.

కొన్ని అంశాలలో విపక్షాలు కలిసి పోరాడటం సహజం. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో అందర్నీ కలుపుకొని పోవడం కాంగ్రెస్ కి అవసరం. కానీ కొందరు నేతలు మాత్రం పవన్ సమావేశానికి వెళ్లిన నేతలను తప్పుపడుతున్నారు. అయితే దీని వెనుక మరో కారణం ఉందని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి ముందున్నారని ప్రచారం జరుగుతోంది. హైకమాండ్ కూడా రేవంత్ కి తెలంగాణలో పార్టీ పగ్గాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని కట్టడి చేసేందుకు కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు.. ఆయన పార్టీని చిన్న బుచ్చుతున్నారన్న ప్రచారం నిర్వహించి.. అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం తప్పన్నట్లుగా మాట్లాడారని తెలుస్తోంది.