రాష్ట్ర విభజన సమస్యకు పరిష్కారం లేదా

 

సాధారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నడూ కూడా గొప్ప నిర్ణయాలు తీసుకోవు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకొంటే అది మన రాష్ట్రవిభజన నిర్వాకంలా ఉంటుంది. కొండా నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు, ఒక సమస్యను పరిష్కరించబోతే అనేక సమస్యలు కాంగ్రెస్ తలకు చుట్టుకొన్నాయిప్పుడు.

 

రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేయగానే సీమాంధ్ర ప్రాంతంలో ఊహించనంత తీవ్రంగా ఉద్యమాలు మొదలయ్యాయి. వివిధ శాఖలకు చెందిన దాదాపు 4 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు నిరవధిక సమ్మెకు దిగడంతో రాష్ట్రంలో పాలన స్తంభించిపోయింది.

 

తెలంగాణా ఉద్యమాలు తీవ్ర స్థాయిలో జరిగిన సమయంలో కూడా రాష్ట్రంలోఇటువంటి పరిస్థితి ఏర్పడలేదు. నేడు రాష్ట్రంలోగవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రి మండలి, శాసన సభ్యులు అందరూ ఉన్నపటికీ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం లేదనే అభిప్రాయం సర్వత్రా నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో బహుశః ఇంతదయనీయ పరిస్థితి ఎన్నడు చూసిఉండము.

 

రాష్ట్రవిభజనపై చాలా లోతుగా, క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకొన్నామని చెప్పుకొస్తున్నకాంగ్రెస్ అధిష్టానం ఊహించనివిధంగా ఎదురయిన ఈ గడ్డు పరిస్థితులను నుండి ఏవిధంగా బయటపడాలోతెలియక విలవిలలాడుతోంది. ఇదంతా నిశితంగా గమనిస్తున్న,టీ-జేయేసీ, తెరాస నేతలు కేంద్రానికి గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక రాష్ట్ర విభజన నిర్ణయం వెనక్కి తీసుకొనే వరకు ఉద్యమం, సమ్మె కొనసాగుతాయని సీమాంధ్ర నేతలు ఉద్యోగులు స్పష్టం చేయడంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఏమిచేయాలో పాలుపోవడం లేదు.

 

అయినప్పటికీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరూ కూడా నేటికీ తెలంగాణా ఏర్పాటుకే మొగ్గుచూపుతుండటం విశేషమనే చెప్పాలి. అంటోనీ కమిటీ కూడా తనను కలవడానికి వస్తున్న సీమాంధ్ర నేతలకు సమైక్యవాదం గురించి తప్ప మరే సమస్య గురించయినా మాట్లాడవచ్చని చెపుతుండటం విశేషం. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై ఇంత ధృడంగా నిలబడటం చాల గొప్ప విషయమే. కాంగ్రెస్ అధిష్టానం అంత గట్టిగా నిర్ణయం తీసుకొన్న తరువాత ఇక అంటోనీ కమిటీ ఏర్పాటు కూడా అనవసరమేనని సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు.

 

దేశాన్ని ఏలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఇటువంటి క్లిష్ట సమస్యలను పరిష్కరించగల మేధావులు, నిపుణులు, వారికి అవసరమయిన సకల సమాచారం అందించగల గూడచారి వ్యవస్థలు అన్నీ ఉన్నపటికీ, కేవలం రాజకీయ కోణం నుంచి మాత్రమే తెలంగాణా సమస్యను పరిష్కరించబోయి కాంగ్రెస్ అధిష్టానం భంగపడింది. తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు సంక్లిష్టమయిన రాష్ట్ర విభజన ప్రక్రియను అశ్రద్ధగా, అనాలోచితంగా, నిర్లక్ష్యంగా చేసి ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకొంటోంది.

 

అయితే తిలా పాపం తలో పిడికెడు అన్నట్లు, నేటి ఈ పరిస్థితికి కాంగ్రెస్ అధిష్టానంతో బాటు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా బాధ్యత వహించక తప్పదు. రాష్ట్ర విభజనకు అనుకూలమని లేఖలు ఇచ్చిన అన్నిరాజకీయ పార్టీలు కేంద్రం నిర్ణయం ప్రకటించేవరకు మౌనంగా ఉండటంతో ఇక ప్రతిపక్షాల నుండి వ్యతిరేఖత ఉండబోదని కాంగ్రెస్ అధిష్టానం పొరబడింది. కానీ అవి మళ్ళీ షరా మామూలుగానే మాట మార్చి ఈ దుస్థితికి కారణమయ్యాయి.

 

తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ కూడా ఇదంతా వారి శ్రేయస్సు కోసమేనని మభ్యపెడుతున్నాయి. ఈ సమస్యకు రాజకీయ పార్టీలు పరిష్కారం చూపలేకపోవచ్చును. బహుశః కాలమే దీనికి పరిష్కారం చూపగలదేమో!