వారు జగన్ కోవర్టులా? వై.ఎస్.ఆర్. అభిమానులా?
Published on: Wed Apr 11, 2012 10:39AM
కాంగ్రెస్ పార్టీలో జగన్ కు చెందిన కోవర్టులు వున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే వారు కోవర్టులు కాదని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలను వేరువేరుగా చూడలేమనే భావనను ఎం.పి. సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రి వీర శివారెడ్డి వంటివారు వ్యాఖ్యానించారు. వైఎస్ సహకరించకుండా జగన్ వేల కోట్ల రూపాయలు సమీకరించడం సాధ్యం కాదని, జగన్ సచివాలయానికి రాకపోయినా ఇంట్లో వుండి అన్ని వ్యవహారాలూ నడిపించారని అందువల్ల జగన్ అవినీతితోపాటు వైఎస్ రాజశేఖర్రెడ్డిని విమర్శించక తప్పదని వీరంటున్నారు.
అయితే ఇదే సమయంలో వైఎస్ పట్ల వీరాభిమానం ప్రదర్శిస్తున్న నాయకులు కూడా వున్నారు. పిసిసి నేత బొత్స స్వయంగా వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ నాయకుడని, ముఖ్యమంత్రిగా ఆయనను విమర్శిస్తే మొత్తం మంత్రివర్గం అభాసుపాలవువుతుందని అందువల్ల రాజశేఖరరెడ్డిని కాంగ్రెస్ నేతగానే చూడాలని బొత్సతోపాటు మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శించాలనే వాదనను ముందుకు తీసుకురావడంతో కడప జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులు సాయిప్రతాప్ తీవ్ర అభ్యంతరం చెప్పారు. వైఎస్ తనకు అత్యంత సన్నిహితుడని ఆయనను విమర్శించడం అసాధ్యమని అన్నారు.
వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డి కూడా వైఎస్ ను విమర్శిస్తే సహించేది లేదు అని ప్రకటించారు. కీలక స్థానాలలో వున్నవారే వైఎస్ పట్ల ఇంతటి అభిమానం చాతుతున్నప్పుడు ఇక ప్రత్యేకంగా కోవర్టులు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముందని జగన్ ఇంట్లో వుంది ప్రయోజనాలు పొందితే కొంతమంది ఆయన మంత్రివర్గంలో, శాసనసభలో, పార్లమెంటులో వుంది ప్రయోజనం పొందారని ఇటువంటి వారంతా ఏకమైనా ఆశ్చర్యపోనక్కరలేదని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.


