TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేరళ ఎగ్జిట్ పోల్స్.. హస్తవాసి చాలా బాగుంది!

Published on: Thu Apr 30, 2026 11:27AM

దక్షిణ భారత రాజకీయాల్లో కీలకమైన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో  వివిధ జాతీయ,  ప్రాంతీయ  సంస్థలు బుధవారం (ఏప్రిల్ 29) వెల్లడించిన  ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే పట్టం కట్టాయి.  సుదీర్ఘ విరామం తర్వాత కేరళలో అధికార మార్పిడి జరగబోతోందనీ, ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్  సర్కార్ గద్దె దిగడం ఖాయమని  దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్సూ కూడా అంచనా వేశాయి. కేరళలో  కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నాయి. 

మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో  ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71.  బుధవారం (ఏప్రిల్ 29)   వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే  అధికారమని అంచనా వేశాయి. పినరయి విజయన్ వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు లేవని పేర్కొన్నాయి.  ఇందుకు  యాంటీ ఇంకంబెన్సీ,  కారణమని పేర్కొన్నాయి. దానికి తోడు..  కాంగ్రెస్ దూకుడు కూడా పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కార్ వెనుకబాటుకు కారణమని విశ్లేషించాయి. 

కాగా.. కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తెలంగాణకు చెందిన మంత్రుల బృందంతో కలిసి ఆయన కేరళలో  ఇంచుమించు  పది రోజుల పాటు విస్తృతంగా పర్యటించి..  యూడీఎఫ్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు.   ఈ ప్రచార సమయంలో కేరళ సీఎం విజయన్‌కు, రేవంత్ రెడ్డికి మధ్య జరిగిన మాటల యుద్ధం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. రేవంత్ రెడ్డి వ్యూహాలు,  కాంగ్రెస్ జాతీయ నాయకత్వం చేసిన ప్రచారం ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలమైనట్లు సర్వేల ఫలితాలు సూచిస్తున్నాయి.

 యాక్సిస్ మై ఇండియా సర్వే కేరళలో యూడీఎఫ్‌కు 78 నుంచి 90 స్థానాలు దక్కుతాయని పేర్కొనగా,  పోల్ ల్యాబ్ సర్వే  ఏకంగా 90 నుంచి 92 సీట్లు వస్తాయని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీస్  అయితే కాంగ్రెస్ కూటమి 72 నుంచి 80 , పీపుల్స్ పల్స్ 75నుంచి 85 స్థానాలను యూడీఎఫ్ సాధిస్తుందని అంచనా వేశాయి.  ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే కూడా కాంగ్రెస్ కూటమికి 76 నుంచి 81 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.  ఇక సర్వే సంస్థల అంచనాల మేరకు అధికార ఎల్‌డీఎఫ్ కూటమి  45 - 66 స్థానాలకే  మధ్యే పరిమితమయ్యే అవకాశం ఉంది
 బీజేపీ  కేరళలో తన ఉనికిని చాటుకోవాలని తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఫలితాల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని సర్వేలు పేర్కొన్నాయి. చాలా వరకూ సర్వే సంస్థలు రాష్ట్రంలో బీజేపీ ఖాతా తెరిచే అవకాశం లేదని అంచనా వేశాయి.  

ప్రస్తుత ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే, కేరళలో ఐదేళ్లకోసారి అధికారం మారే సాంప్రదాయం మళ్లీ పునరావృతమైనట్లు అవుతుంది. గత ఎన్నికల్లో విజయన్ ఈ సంప్రదాయాన్ని చెరిపివేస్తూ వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకున్నారు. కానీ ఈసారి ప్రజలు మార్పును కోరుకున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.  పెరిగిన ధరలు, నిరుద్యోగం మరియు పాలనపై వ్యతిరేకత వంటి అంశాలు విజయన్ ప్రభుత్వానికి ప్రతికూలంగా మారాయని తెలుస్తోంది.

మరోవైపు, కాంగ్రెస్ శ్రేణులు ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పండుగ చేసుకుంటున్నాయి. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ తర్వాత కేరళలో కూడా పట్టు సాధించడం ద్వారా జాతీయ స్థాయిలో పార్టీకి పునర్వైభవం వస్తుందని హస్తం నేతలు అంటున్నారు.