విస్కీలో సోడా కలిపే వాళ్లే మంత్రులు!  

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పని తీరుపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు   కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి. తెలంగాణ వచ్చాకా  దోపిడికి అంతే లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు పోటీ పడి మరీ అవినీతికి పాల్పడుతూ ప్రజా ధనం కాజేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో విస్కీలో సోడా కలిపే వాళ్లలే  మంత్రి పదవులొచ్చాయన్నారు జగ్గారెడ్డి. ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నపుడు హరీష్ రావు ఐదారు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆ బ్లాక్ మనీ తోనే కేసీఆర్ సర్కార్ ను పడేసే ప్రయత్నం చేశారంటూ హాట్ కామెంట్స్ చేశారు జగ్గారెడ్డి.పాస్ పోర్ట్ దందాలో తెలంగాణ  రాష్ట్రానికి కేసీఆరే గురువుని విమర్శించారు. టీఆరెస్ పాలనలో ఐఏఎస్ లు , ఐపీఎస్ లు,అధికారులు, ఉద్యోగ సంఘాలు డమ్మీగా మారిపోయారన్నారు. 

 తెలంగాణ ఏర్పాటుపైనా  సంచలన  వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ తప్పు పనిచేసిందన్నారు. అయితే ఇది  తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. తెలంగాణ వచ్చాక అవినీతి పెరిగిపోయిందన్నారు. కేసీఆర్  సర్కార్ మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి..  మెగా కృష్ణారెడ్డికి  దారపోసిందని జగ్గారెడ్డి ఆరోపించారు. మారుతీ కారులో తిరిగిన మెగా కృష్ణా రెడ్డికి  ఆరు ఏండ్లలోనే 30 వేల కోట్ల రూపాయల డబ్బు ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాల్లో కృష్ణా రెడ్డి కి కేసీఆర్ దోచిపెట్టారని చెప్పారు జగ్గారెడ్డి. 

కాంగ్రెస్ పై ఆరోపణలు చేసిన మంత్రి జగదీశ్ రెడ్డిపై విరుచుకుపడ్డారు జగ్గారెడ్డి. నెహ్రు గురించి మాట్లాడే అర్హత మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి లేదన్నారు. క్యారెక్టర్ లేని జగదీశ్  సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగదీశ్వర్ రెడ్డి కరెంట్ మినిస్టర్ ఐనా.. ఆయన బాడీలో కరెంట్ లేదన్నారు జగ్గారెడ్డి. కేసీఆర్ కు విస్కీలో సోడా కలిపినందుకే ఆయనకు మంత్రి పదవి వచ్చిందన్నారు. తాగిన తర్వాత  ఎక్కడ సంతకం పెడతాడో కూడా జగదీశ్ రెడ్డికి తెలియదని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కేసీఆర్ అవినీతి మొత్తం బయటపెడతామని జగ్గారెడ్డి హెచ్చరించారు. నాగార్జున సాగర్ నిర్మాణంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా తాము సిద్దమేనన్నారు జగ్గారెడ్డి. 

అంతకుముందు మాట్లాడిన మంత్రి జగదీశ్ రెడ్డి.. తెలంగాణ ప్రజల ఊసురుతోనే కాంగ్రెస్ పార్టీ నాశనం అయిందని అన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను మానుకోవాలని హితవు పలికారు. అవినీతికి ప్రత్యేక మ్యాప్ వేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రాజక్టుల డిజైన్ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపైన తెలంగాణ ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. భవిష్యత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాదని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్క చుక్క మంచి నీరు కూడా ఇవ్వలేదన్నారు. జైలుకు వెళ్ళిన చరిత్ర కాంగ్రెస్ మంత్రులకు, నాయకులకు ఉందన్నారు. ప్రజల కోసం కట్టే ప్రాజక్టులను అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.