TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీహారీ బ్యాచ్‌కి మూడిన‌ట్టేనా? ఆ ఐటీ రైడ్స్‌లో తీగ దొరికిందా?

Published on: Sat Mar 19, 2022 4:56PM

కేఎన్ఆర్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌పై ఐటీ రైడ్స్‌. ఈ ఒక్క ఎపిసోడ్ అనేక డొంక‌ల‌ను క‌దిలించింద‌ని అంటున్నారు. ఆ ఐటీ సోదాల్లో భారీ న‌గ‌దుతో పాటు కీల‌క డాక్యుమెంట్లు దొరికాయ‌ని తెలుస్తోంది. ఆ ప‌త్రాల్లో.. ప‌లువురు ప్ర‌ముఖుల పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌ని అంటున్నారు. ప్ర‌ధానంగా మంత్రి కేటీఆర్ చుట్టూ ఐటీ ఉచ్చు బిగుస్తోంద‌ని.. ఆయ‌న‌తో పాటు ప‌లువురు ఉన్న‌తాధికారుల లింకులూ వెలుగు చూశాయ‌ని స‌మాచారం. ఆ వివ‌రాల‌న్నీ స‌మ‌గ్రంగా ప‌రిశీలిస్తున్న ఐటీ శాఖ‌.. త్వ‌ర‌లోనే ప‌లు కేసులు న‌మోదు చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు చెబుతున్నారు. 

కేఎన్ఆర్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ తెలంగాణ‌లో కాళేశ్వ‌రంతో స‌హా ప‌లు ప్రాజెక్టుల‌కు ప్యాకేజీ ప‌నులు చేస్తోంది. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ ప్ర‌ధాన కాంట్రాక్ట‌ర్ అయిన మేఘా సంస్థ‌.. నీటిపారుద‌ల శాఖ ఉన్న‌తాధికారి ర‌జిత్ కుమార్ కూతురు వెడ్డింగ్ ఈవెంట్ ఖ‌ర్చు అంతా భ‌రించింద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌లో జ‌రిగిన ఆ వివాహ విందుకు మేఘా సంస్థ‌కు చెందిన కంపెనీలు భారీ మొత్తంలో బిల్లులు చెల్లించాయ‌ని తెలిసింది. ఆ మేర‌కు ర‌జిత్ కుమార్ మీద ఇప్ప‌టికే డీవోపీటీకి కంప్లైంట్ కూడా అందింది. ఆ ఫిర్యాదును ప‌రిశీలించి, ఎంక్వైరీ చేయాలంటూ సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించింది డీవోపీటీ. ఇక‌, లేటెస్ట్‌గా ఫాంహౌజ్‌లో కేసీఆర్ జ‌రిపిన అత్య‌వ‌స‌ర స‌మావేశంలో.. ర‌జిత్ కుమార్‌పై వ‌చ్చిన‌ కంప్లైంట్ గురించి సీఎస్‌ను ముఖ్య‌మంత్రి ఆరా తీసిన‌ట్టు స‌మాచారం.

ర‌జిత్ కుమార్ అనే కాదు.. కేఎన్ఆర్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ సంస్థ‌లో జ‌రిగిన ఐటీ సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్‌లో.. ఐఏఎస్‌లు సోమేశ్ కుమార్‌, అర‌వింద్ కుమార్‌, జ‌యేశ్ రంజ‌న్‌ల పేర్లు కూడా ఉన్న‌ట్టు స‌మాచారం. వీరంతా బీహార్ అధికారులే కావ‌డం.. ఇందులో అర‌వింద్ కుమార్‌, జ‌యేశ్ రంజ‌న్‌లు కేటీఆర్‌తో బాగా క్లోజ్‌గా ఉండే ఆఫీస‌ర్లు కావ‌డం ఆస‌క్తిక‌రం. ఈ ఐటీ దాడులు.. త్వ‌ర‌లోనే ఈడీ అటాక్స్‌కు దారి చూపించ‌బోతున్నాయ‌నే ప్ర‌చారం ఆయా వ‌ర్గాల‌ను షేక్ చేస్తున్నాయి.