కరీంనగర్లో వెల్లివిరిసిన మత సామరస్యం- హిందూ ఏక్తా యాత్రలో రాముడి విగ్రహంపై ముస్లంలు పూల వర్షం
Published on: Thu May 26, 2022 1:06PM
భిన్నత్వంలో ఏకత్వం భారతీయుల డిఎన్ఏలోనే ఉందని మరో సారి నిరూపించిన సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. దేశంలో విద్వేష భావాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే శక్తులకు చెంపపెట్టులాంటి సంఘటన అది. కరీంనగర్ జిల్లాలో ఏక్తాయాత్ర జరుుగతుండగా ముస్లింలు రాముడి విగ్రహంపై పూల వర్షం కురిపించారు.
అది కూడా మసీదులు తవ్వుదాం అంటూ ప్రకటించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండ సంజయ్ పాల్గొన్న యాత్రలోనే కావడం విశేషం. హిందూ ఏక్తా యాత్ర పేరుతో బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో హనుమాన్ శోభా యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ముస్లింలు రాముడి విగ్రహంపై ముస్లింలు పూల వర్షం కురిపించి మతసామరస్యాన్ని చాటారు.
దేశంలో హిందూ పండుగలను ముస్లింలు, ముస్లిం పడుగలను హిందువులూ గౌరవించి వాటిల్లో పాల్గొనడం అరుదైన సంఘటనలేమీ కావు. మతలు వేరైనా మానవులంతా సమానమేనని సామరస్యాన్ని చాటడం దేశంలో హిందూ ముస్లింల సహోదరతత్వానికి నిదర్శనం. హైదరాబాద్ లో గణేష్ శోభాయాత్ర సందర్భంగా పాత బస్తీలో ముస్లింలు హిందువులకు మజ్జిగ, మంచినీరు సరఫరా చేయడం, రంజాన్ సందర్భంగా ముస్లింలకు హిందువులు శుభాకాంక్షలు తెలపడం సాధారణమే.
అయితే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు నాయకులు, కొన్ని పార్టీలూ దేశంలో మత సామరస్యానికి భంగం కలిగించి పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. అటువంటి వారికి హిందూ ముస్లింల సామరస్యం చెంపపెట్టుగా నిలుస్తుంది.


