TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్ర‌జాస్వామ్యంలోనే పేద‌వారి క‌ల‌లు సాకారం .. ముర్ము

Published on: Mon Jul 25, 2022 12:07PM

స్వతంత్ర భార‌త దేశంలో జ‌న్మించి రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని చేప‌ట్టిన తొలి మ‌హిళ‌ను తానేన‌ని భార‌త  రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అన్నారు. ఒడిషాలో ఎక్క‌డో మారుమూల గ్రామంలో జ‌న్మించి దేశ ఉన్న‌త ప‌ద‌వికి రావ‌డం భార‌త‌దేశ ప్ర‌జాస్వామ్యం గొప్ప‌ద‌నాన్ని తెలియ‌జేస్తుంద‌ని ఆమె అన్నారు. ఆజాదీ కా అమృతోత్స‌వ్ జ‌రుగు తున్న వేళ తాను దేశ ఉన్న‌త‌ప‌ద‌విని అలంక‌రించ‌డం కేవ‌లం త‌న వ్య‌క్తిగ‌త విజ‌యం కాద‌ని దేశ ప్ర‌జ‌లం ద‌రికీ ద‌క్కుతుంద‌ని ఆమె అన్నారు. మంచి విద్య‌ను ఆశించిన తాను ఈ స్థాయికి అభివృద్ధి చెంద‌డం ప్ర‌జా స్వామ్య దేశంలో పేద ప్ర‌జ‌ల క‌ల‌లు సాకారం కాగ‌ల‌వ‌నడానికి గొప్ప నిద‌ర్శ‌న‌మ‌ని ముర్మూ అన్నారు. 

దేశంలో యువ‌త కేవ‌లం త‌మ భ‌విష్య‌త్తునే ప్ర‌ధానంగా తీసుకోవ‌డం గాకుండా దేశాభివృద్ధికి త‌మ వంతు  కృషి చేయాల‌న్నారు. యువ‌త ప్ర‌గ‌తికి  రాష్ట్ర‌ప‌తిగా త‌మ మ‌ద్ద‌తు ఎప్పుడూ ఉంటుంద‌ని ఆమె హామీ నిచ్చారు.

స‌మాజంలో నిమ్న‌వ‌ర్గాల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టిపెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.  దేశం అన్ని రంగాల్లోనూ స‌ర్వ‌తోముఖాభివృద్ధి సాధిస్తున్న‌ద‌ని, ముఖ్యంగా కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యం లో దేశంలో ఐక‌మ‌త్యం ప్ర‌తిఫ‌లించేట్టు ముంద‌డుగు వేసింద‌ని, ప్ర‌పంచ దేశాల‌కు ఉదాహ‌ర‌ణ‌గా నిలి చింద‌ని ఆమె ఆనందం వ్య‌క్తం చేశారు. 

భార‌త దేశ 15వ రాష్ట్ర‌ప‌తిగా ద్రౌప‌ది ముర్మూ సోమ‌వారం పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాలులో ఉభ‌య‌స‌భ‌ల స‌భ్యుల స‌మ‌క్షంలో ప్రమాణం చేశారు. ముర్మూతో సీజేఐ ఎన్‌.వి. ర‌మ‌ణ ప్ర‌మాణం చేయించారు.  ఈ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి ఉప‌రాష్ట్ర‌పతి ఎం.వెంక‌య్య‌నాయుడు, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, స్పీక‌ర్  ఓం బిర్లా, కేంద్ర‌మంత్రులు, ఎంపీలు, గ‌వ‌ర్న‌ర్లు, సీఎంలు, త్రివిధ ద‌ళాధిప‌తులు హాజ‌ర‌య్యారు. కాగా, రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని అలంక‌రించిన తొలి ఆదివాసిగా ముర్మూ చ‌రిత్ర సృష్టించ‌గా, ఆమెతో  రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌మాణ స్వీకా రం చేయించిన తొలి తెలుగు జీజేఐగా ఎన్‌.వి. ర‌మ‌ణ చ‌రిత్ర‌కెక్కారు.