డిప్యూటీ సీఎంపై రోజా ఫైర్.. నాకు చెప్పకుండా నా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారు?

ఎప్పుడూ ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా.. ఈసారి సొంత పార్టీ నేతపైనే విరుచుకుపడ్డారు. అది కూడా ఏకంగా డిప్యూటీ సీఎం పైనే మండిపడ్డారు.

డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా పుత్తూరులో పర్యటించారు. అంబేద్కర్ సంఘం తరపున దళితులకు కల్యాణ మంటప స్థల సేకరణ కోసం.. పుత్తూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అయితే, ఈ కార్యక్రమానికి రోజాను పిలవకపోవడంతో.. తనకు సమాచారం ఇవ్వకుండానే తన నియోజకర్గంలో ఎలా పర్యటిస్తారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకర్గంలో తాను అందుబాటులోనే ఉన్నాననే విషయం తెలిసికూడా.. తనకు చెప్పకుండా తన నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారని రోజా ఫైర్ అయ్యారు. తనను పట్టించుకోకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారని రోజా ఆరోపించారు.

గత కొంతకాలంగా నారాయణస్వామి, రోజాల మధ్య విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో నారాయణస్వామి స్వయంగా వెళ్లి రోజాతో మాట్లాడారట. అయినా, విభేదాలు ముదురుతూనే ఉన్నాయి. దానికి ప్రస్తుత ఘటనే సాక్ష్యమని అంటున్నారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో పర్యటించడం పై.. ఇప్పటికే రోజా.. డిప్యూటీ సీఎంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.