‘కాఫీ కింగ్‌’ సిద్ధార్థ.. విజయ విషాద గాధ

 

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘కేఫ్‌ కాఫీ డే’ వ్యవస్థాపకుడు ఆయన. కాఫీ సాగు కుటుంబంలో పుట్టి ‘కాఫీ కింగ్‌’ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఆయన. ఒకప్పుడు సక్సెస్‌కు చిరునామా.. కానీ నేడు ఓ విఫల వ్యాపారినంటూ లేఖ రాసి.. లోకాన్ని వీడారు. వి.జి. సిద్ధార్థ విజయ గాధ విషాద గాధగా ఎలా మారిపోయింది?.

కర్ణాటకలోని చిక్‌మగుళూరు జిల్లాలోని ఓ కాఫీ సాగు కుటుంబంలో పుట్టారు సిద్ధార్థ. కష్టాలనేవి తెలీకుండా పెరిగాడు. అయితే లోక జ్ఞానం తెలుసుకునేందుకు బోర్డింగ్‌ స్కూల్‌లో చేర్పించారు తల్లిదండ్రులు. చిన్నప్పుడు ఆటల మీదున్న శ్రద్ధ సిద్ధార్థకు చదువు మీద ఉండేది కాదు. అతడి ప్రవర్తనను భరించలేని టీచర్‌ "ఒరే, నీకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పలేకపోతున్నానన్న సందేహం కలుగుతోంది. చదువుపై కాస్త శ్రద్ధ పెడితే నీ భవిష్యత్తుకే మంచిది" అంటూ కంటతడి పెట్టింది. టీచర్‌ కన్నీళ్లు చూశాక కళ్లు తెరిచాడు సిద్ధార్థ. అప్పటి నుండి చదువుపై శ్రద్ద పెట్టాడు.

దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులంటే సిద్ధార్థకు అభిమానం, గౌరవం. తాను కూడా సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలి అనుకునేవాడు. అందుకే.. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాక సైన్యంలోకి వెళదామని డిఫెన్స్‌ అకాడమీ పరీక్ష రాశారు. కానీ ఉత్తీర్ణుడు కాలేదు. దీంతో చేసేది లేక మంగళూరుకు వెళ్లి అర్థశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశారు. 

ఒక రోజు స్టాక్‌మార్కెట్‌పై శిక్షణ కోసం ముంబై వెళ్లాలనుకుంటున్నా అంటూ తల్లిదండ్రులతో చెప్పారు. అయితే కాఫీ తోటలు చూసుకుంటాడనుకున్న కొడుకు ఇలా మాట్లాడటం తల్లిదండ్రులకు ఆశ్చర్యం కలిగించింది. ఎంత చెప్పినా వినకపోవడంతో.. ఆఖరికి తండ్రి సిద్ధార్థ చేతిలో కొంత డబ్బు పెట్టి సాగనంపారు. చిక్‌మగళూర్‌ నుంచి ముంబై చేరుకున్న సిద్ధార్థ్‌.. మహేష్‌ కంపానీని కలిసి "సార్‌, మీ గురించి చాలా. విన్నాను. నేను ఎకనామిక్స్‌ పట్టభద్రుణ్ణి. చేస్తే గీస్తే మీ దగ్గరే శిష్యరికం చేయాలి. లేదంటే మా ఊరెళ్లి, నాకిష్టం లేకపోయినా కాఫీ తోటలు సాగు చేయక తప్పదు. ఒక్క అవకాశం ఇవ్వండి"  అంటూ వినయంగా వేడుకున్నారు. సిద్ధార్థ అంకితభావాన్ని చూసి చిరునవ్వుతో ఓకే అన్నారు మహేష్‌ కంపాని. ముంబై స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కి ప్రెసిడెంట్‌, జేఎం క్యాపిటల్‌ అధినేత అయిన ఆయన దగ్గర ఎంతైనా నేర్చుకోవచ్చన్నది సిద్ధార్థ ఆలోచన. అలా ఆయన దగ్గర స్టాక్‌మార్కెట్‌లో పాఠాలు, ట్రేడింగ్‌ మెలకువలు ఆపోసన పట్టారు.

స్టాక్‌ మార్కెట్‌ గురించి కొంత అవగాహన వచ్చాక తిరిగి సొంతూరు చేరుకున్నారు సిద్ధార్థ్‌. తాను బెంగళూరులో స్టాక్‌ బ్రోకర్‌ బిజినెస్‌ చేద్దామనుకుంటున్నానని, డబ్బు కావాలని తల్లిదండ్రులను అడిగారు సిద్ధార్థ. తల్లిదండ్రులు ఆయన తపనను గమనించి ఏడున్నర లక్షలు చేతికిచ్చారు. ఒకవేళ వ్యాపారంలో నష్టపోతే, తిరిగొచ్చి కాఫీ తోటలు చూసుకోవాలని ఓ షరతు కూడా విధించారు. ఆ డబ్బుతో శివన్‌ సెక్యూరిటీస్‌ అనే స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీని ప్రారంభించారు. బొంబాయిలో సంపాదించిన పరిజ్ఞానం ఇక్కడ పనికొచ్చింది. వచ్చిన లాభాలతో చిక్‌మగళూరులో కాఫీ తోటలు కొనేవారు. 1985 నుంచి 1993 వరకు సుమారు మూడువేల ఎకరాల కాఫీ తోటల్ని కొనడం సిద్ధార్థ సాధించిన పెద్ద విజయం.

సిద్ధార్థ కుటుంబానికి వేల ఎకరాల కాఫీ తోటలు ఉన్నాయి. ఆ కాఫీ గింజలను ఎవరికో అమ్మే బదులు తానే రిటైల్‌ మార్కెట్లోకి ఎందుకు రాకూడదని అనుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే అమాల్గమేటెడ్‌ బీన్‌ కాఫీ ట్రేడింగ్‌ కంపెనీ. 1992లో ప్రారంభించిన ఈ సంస్థ.. కాఫీ గింజలను విదేశాలకు ఎగుమతి చేస్తుంది. రెండేళ్లలోనే దేశంలోనే అతిపెద్ద కాఫీ ఎగుమతిదారుగా ఈ కంపెనీ ఎదిగింది.

ఒకసారి ఏదో పని మీద సింగపూర్‌ వెళ్లాడు సిద్ధార్థ. అక్కడ ఇంటర్‌నెట్‌ బీర్‌ కెఫే కనిపించింది. అందులో యువతీ యువకులు ఒక చేత్తో బీరు తాగుతూ.. మరో చేత్తో కంప్యూటర్‌ బ్రౌజ్‌ చేస్తున్నారు. సిద్దార్థకు ఆ అవుట్‌లెట్‌ చాలా కొత్తగా అనిపించింది. మన దేశంలో బీరుకు బదులు కాఫీ కెఫేలు పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. 
 
1996లో బెంగళూరులోని అత్యంత రద్దీ అయిన బ్రిగేడ్‌ రోడ్‌లో ‘కేఫ్‌ కాఫీ డే’ పేరుతో తొలి రిటైల్‌ అవుట్‌లెట్‌ను ప్రారంభించారు సిద్ధార్థ. అప్పట్లోనే ఇక్కడ ఒక కాఫీ, గంట ఇంటర్నెట్‌కు రూ.100 ఛార్జ్‌ చేసేవారు. ఈ అవుట్‌లెట్‌ విశేషాదరణ పొందింది. దీంతో ఇతర ప్రాంతాలకూ దీన్ని విస్తరించారు. దేశవ్యాప్తంగా దాదాపు 2000 కెఫేలు ఉన్నాయి. విదేశాల్లోనూ కాఫీడే శాఖలు ఉన్నాయి. అలా తక్కువ కాలంలోనే కాఫీ డేకు మంచి గుర్తింపు లభించింది. కాఫీ కింగ్‌గా సిద్ధార్థ్‌ పేరు మార్మోగింది. కాఫీడేతో పాటు హాస్పిటాలిటీ వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. కెరీర్‌ సక్సెస్‌ఫుల్‌గా ఉన్న సమయంలోనే సిద్ధార్థ ప్రముఖ ఐటీ సంస్థ మైండ్‌ ట్రీలో పెట్టుబడులు పెట్టారు. 1999లో రూ.340 కోట్లతో వాటాలు కొనుగోలు చేశారు. ఈ ఏడాదే మైండ్‌ట్రీలో వాటాలను రూ.3వేల కోట్లకు అమ్మేశారు.

కర్ణాటక మాజీ సీఎం ఎస్‌.ఎం కృష్ణ కుమార్తె మాళవిక కృష్ణను సిద్ధార్థ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇలా కెరీర్‌ హాయిగా సాగిపోతున్న సమయంలో సిద్ధార్థ పన్ను ఎగవేత రూపంలో వివాదాల్లో చిక్కుకున్నారు. కోట్ల రూపాయల పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో 2017లో ఆయన కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేపట్టింది. కాఫీ డే షాపులు, ఎస్టేట్‌లపై అధికారులు దాడులు నిర్వహించారు. రూ. 650కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆయనకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. మరోవైపు కేఫ్‌ కాఫీ డే గత కొంతకాలంగా నష్టాల్లో సాగుతున్నట్లు తెలుస్తోంది.

అలా సక్సెస్‌కు చిరునామాగా మారిన.. ‘కేఫ్‌ కాఫీడే’ యజమాని వి.జి సిద్ధార్థ ఒత్తిడిని జయించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సిద్థార్థ రాసిన లేఖలో ఆదాయ పన్ను విభాగం మాజీ డీజీ వేధింపులు, ఓ ప్రైవేటు ఈక్విటీ సంస్థలోని భాగస్వాములు షేర్లను బైబ్యాక్‌ చేయాలని చేస్తున్న ఒత్తిడిని ప్రస్తావించారు. అయితే ఎందరో వ్యాపారం పేరుతో వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి, అధికార పార్టీలను అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుతున్న ఈరోజుల్లో.. సిద్ధార్థ మాత్రం.. తనకు పిల్లనిచ్చిన మామ మాజీ సీఎం అయినా, ఆయన ప్రస్తుతం అధికార బీజేపీలో ఉన్నా.. తప్పించుకునే ప్రయత్నం చేయకుండా, చివరికి ఒత్తిడిని భరించలేక తనువు చాలించారు. ఇది సిద్ధార్థ విజయ విషాద గాధ.