మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు
Published on: Tue May 26, 2026 8:47AM

వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరను చమురు కంపెనీలు కిలోకు 2 రూపాయలు పెంచాయి. ఈ తాజా పెంపుతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ. 83.09కి చేరింది. ఈ నెల 15 నుంచి ఇప్పటివరకు సీఎన్జీ ధరలు పెరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
11 రోజుల వ్యవధిలోనే సీఎన్జీ ధర ఆరు రూపాయలు పెరిగింది. మే 15న కిలో సీఎన్జీ పై రూ. 2, మే 18న రూ. 1, మే 23న మరో రూపాయి చొప్పున ధరలను పెంచారు. తాజా పెంపుతో నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్లలో కిలో సీఎన్జీ ధర రూ. 88.70కి చేరింది. గురుగ్రామ్లో రూ. 86.12, ముంబైలో రూ. 84గా ఉంది.
ఇరాన్లో కొనసాగుతున్న యుద్ధం, హర్మూజ్ జలసంధి వద్ద చమురు, గ్యాస్ సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలే ఈ వరుస పెంపులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. సీఎన్జీ ధర పెంపు ప్రభావం కేవలం వాహనదారులపైనే కాకుండా సామాన్యులపైనా పడుతుంది. ఆటో, క్యాబ్ చార్జీలు పెరగడంతో పాటు, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి.


