కిరణ్ - జగన్ లాలూచీ పడ్డారా?
Published on: Sat Apr 28, 2012 10:18AM
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జగన్ తో లాలూచీ పడినట్టు కాంగ్రెస్ పార్టీలోనే ప్రచారం జరగడం కిరణ్ కు ఇబ్బందిగా మారింది. దాంతో ఆయన తాను వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ను, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డిని స్వయంగా విమర్శించకపోయినా తన అనుంగ మంత్రులు, అనుచరుల ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. అందువల్ల తాను జగన్ తో లాలూచీ పడినట్టు ప్రచారం చేయడం తగదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
వై.ఎస్.ఆర్. పార్టీని, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డిని తీవ్రంగా విమర్శిస్తున్న మంత్రులలో కొండ్రు మురళి ఒకరు. మురళి తనకు అత్యంత సన్నిహితుడని, అతను జగన్ ను విమర్శిస్తున్నాడంటే తాను విమర్శిస్తున్నట్టేనని వివరణ ఇచ్చుకొంటున్నారు. అయితే శంఖంలో పోస్తే తీర్థం అయినట్టు ఎంతమంది ఎంత ఘాటుగా విమర్శ చేసినా ముఖ్యమంత్రి హోదాలో కిరణ్ స్వయంగా విమర్శ చేసినప్పుడు దానికి విలువ వుంటుందని వి.హనుమంతరావు, పాల్వాయి గోవర్థన్ వంటి సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. తాను విమర్శించకుండా తన తరపున తన అనుచరులు విమర్శిస్తున్నారని చెప్పే కిరణ్ చెప్పడం పార్టీని, పార్టీ కార్యకర్తలను మోసం చేయడమేనని కిరణ్ వ్యతిరేకులు అంటున్నారు.


