సినీ ఇండస్ట్రీకి సీఎం కేసీఆర్ భరోసా.. దశల వారీగా షూటింగ్స్‌కు అనుమతి

సినీ పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ టాలీవుడ్ పెద్దలకు హామీ ఇచ్చారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, సినీ ప్రముఖులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. సీఎం ని కలిసిన వారిలో.. చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, దిల్ రాజు, సి.కల్యాణ్, రాజమౌళి, కొరటాల శివ, ఎన్.శంకర్ తదితరులు ఉన్నారు. సుమారు అరగంటకు పైగా భేటీ జరిగింది. షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని, అదే విధంగా థియేటర్స్ కూడా ఓపెన్ చేయాలని సినీ ప్రముఖులు సీఎంను కోరారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు కీలక సూచనలు చేశారు. ఆగిపోయిన షూటింగులను దశల వారీగా పునరుద్ధరిస్తామని ప్రకటించారు. కోవిడ్ నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ.. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నందున.. ప్రిప్రొడక్షన్, షూటింగులు, థియేటర్లను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. తక్కువ మందితో, ఇండోర్‌లో చేసే వీలున్న ప్రిప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని, తర్వాత దశలో జూన్ లో సినిమా షూటింగులు ప్రారంభించాలని సీఎం సూచించారు. చివరగా పరిస్థితిని బట్టి, థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు.

ఎంత మందితో షూటింగులు నిర్వహించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై మంత్రి తలసాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లతో చర్చించాలని సినీ ప్రముఖులను సీఎం కోరారు. ఆ తర్వాత ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి, షూటింగులకు అనుమతి ఇస్తుందని సీఎం స్పష్టం చేశారు.