ప్రైవేట్ టీచర్లకు కేసీఆర్ బాసట

కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడం తో ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని  గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కి  నెలకు రెండు వేల రూపాయల ఆపత్కాల  ఆర్ధిక సాయం తో పాటు  కుటుంబానికి  25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి  నిర్ణయించారు.ఇందుకు సంబంధించి ప్రయివేటు  విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో  స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని సిఎం కేసీఆర్ తెలిపారు.

ఇందుకు గాను, విద్యాశాఖ అధికారుల సమన్వయం చేసుకుంటూ  విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు ను సిఎం ఆదేశించారు. ప్రయివేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలను  మానవీయ దృక్ఫథంతో  ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1 లక్షా 45 వేల మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కి లబ్ధిచేకూరుతుంది.

కరోనా లాక్ డౌన్ తో గత ఏడాది మార్చి లో స్కూల్స్ , కాలేజీలు మూతపడగా.. అందులో పని చేసే అద్యాపకులు, సిబ్బంది రోడ్డున పడ్డారు. వాళ్లు పనిచేసే యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఆర్థిక ఇబ్బందులకు తాళలేక కొందరు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. తాజాగా కరోనా వ్యాప్తితో మరోసారి విద్యాసంస్థలు మూసివేయడంతో... వాళ్లకు మళ్లీ కష్టాలు వచ్చాయి.