పయ్యావులకు కేసీఆర్ ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా...?


పరిటాల శ్రీరామ్ పెళ్లిలో టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కేసేపు ముచ్చటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంలో పయ్యావులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారని... ఆయనకి క్లాస్ తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇందుకు గాను.. పయ్యావుల కూడా ఫీలైనట్టు.. తాను తప్పేం చేయలేదని... కేసీఆరే తనతో మాట్లాడారని.. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ గొడవ అంతా పక్కన పెడితే.. అసలు ఇంతకీ వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారబ్బా అనేది మాత్రం ఇప్పటి వరకూ రహస్యంగానే ఉంది. దీనిపై పయ్యావలు కూడా ఏం చెప్పలేదు. కానీ ఇప్పుడు దీనిపై ఓ వార్త మాత్రం హల్ చల్ చేస్తుంది. టీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో కూకట్ పల్లి లేదా శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తావా అని పయ్యావుల కేశవ్ ను కేసీఆర్ అడిగారట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సీమాంధ్రులు అందులో కమ్మ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండే కూకట్ పల్లి లేదా శేరిలింగంపల్లి నుంచి పోటీ చేయాలని పయ్యావులను కోరారట కేసీఆర్. అయితే ఇందుకు పయ్యావుల అంగీకరించలేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి కేసీఆర్ కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి బాగానే ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.