జగన్ సంచలన నిర్ణయం.. ప్రజావేదిక భవనం కూల్చివేత!!

 

ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం ఉదయం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అవినీతిని ఏమాత్రం సహించనని హెచ్చరించారు. ప్రజావేదిక కూల్చివేతతోనే అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వ చర్యలు మొదలవుతాయన్నారు.

‘ప్రజలకు మనం సేవకులన్న విషయం ప్రతి నిమిషం గుర్తించుకోవాలి. ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకొన్నారు. అందరం సమష్టిగా పనిచేస్తేనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయగలుగుతాం. వచ్చే ఎన్నికల నాటికి మేనిఫెస్టోను  పూర్తి చేశామని చెప్పగలగాలి’ అని జగన్ అన్నారు.

‘పేదలు, రైతులను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో రూపొందించాం. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి. ఎన్నికలయ్యే వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అందరూ మనవాళ్లే.' అని జగన్ వ్యాఖ్యానించారు.

'వ్యవస్థను మార్చాలన్నదే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఇది గ్రామస్థాయి నుంచే మొదలుకావాలి. చెడిపోయిన వ్యవస్థ మారాలని నేను మొదట్నుంచీ చెబుతూనే ఉన్నా. ప్రతి అడుగులోనూ పారదర్శకత కనిపించాలి. ప్రజలు హక్కుగా పొందాల్సిన సేవలకు లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదు.  కార్యాలయాల చుట్టూ తిరిగేలా ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. ప్రభుత్వ యంత్రాంగమంతా నిజాయతీగా పనిచేయాలి. అవినీతి రహిత పాలన అందించాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం.’ అని స్పష్టం చేసారు.

‘మనం అందరం కూర్చున్న ఈ భవనం చట్టబద్ధమైన నిర్మాణమేనా?. ఈ భవనం అవినీతి సొమ్ముతో కట్టింది. అక్రమంగా నిర్మించిన భవనమని తెలిసీ ఇక్కడే మనం సమావేశం పెట్టుకున్నాం. మన ప్రవర్తన ఎలా ఉండాలో తెలియజేయడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించా. ప్రక్షాళన ఈ భవనం నుంచే ప్రారంభం కావాలి. ఎల్లుండి నుంచే ఈ భవనం కూల్చివేత పనులు చేపడతాం. ఇదే ఈ భవనంలో చివరి సమావేశం. ప్రజావేదిక నుంచే రాష్ట్రంలో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభిద్దాం.’ అని జగన్‌ అధికారులకు పిలుపునిచ్చారు.