ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి.. అవునా..నిజమా..జగన్రెడ్డి!?
Published on: Wed Mar 23, 2022 2:35PM
మూడేళ్లు ఫుల్లుగా తనను మేపితే.. పర్వతాన్ని మోస్తానన్నాడట వెనకటికి ఒకడు. అతగాడిని జనమంతా మేపారు. తీరా పర్వతాన్ని మోయాల్సిన సమయానికి ‘మీరు పర్వతాన్ని తెచ్చి నా భుజంపై పెట్టండి మోస్తా’ అన్నాడట. అలా ఉంది ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన తీరు. పోలవరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి ఈ మూడేళ్లుగా అంతగా పట్టించుకోని వైసీపీ సర్కార్ ఇప్పుడు వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తిచేసేసి, నీళ్లు కూడా ఇచ్చేస్తుందట. అయితే.. అందుకు కేంద్ర ప్రభుత్వం డిజైన్ ఖరారు చేయడం, నిధులివ్వడమే తరువాయట. పోలవరం ప్రధాన డ్యామ్ లో కీలకమైన డయాఫ్రమ్ వాల్ డిజైన్లు ఈ నెలాఖరులో ఖరారు చేస్తామని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మాట ఇచ్చారని చెప్పుకొచ్చారు జగన్. ఆమోదం లభించిన 18 నెలల్లోనే పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామంటున్నారు.
అయితే.. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి అస్సలు పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోస్తూనే ఉన్న విషయం తెలిసిందే. పోలవరం విషయంలో అంత చేశాం… ఇంత చేసేశాం అంటూ జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పుకోవడాన్ని విపక్ష నేతలు తప్పుపడుతున్నారు. పనిలో పనిగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపైన కూడా తన అక్కసును వెళ్లగక్కడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు అంగుళం కూడా తగ్గించరట. 41.15 మీటర్ల కాంటూరులోని నిర్వాసిత కుటుంబాలను తరలించే ప్రక్రియ చేపట్టారట. నిజానికి పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 45.72 మీటర్లు. అయితే.. 41.15 మీటర్ల కాంటూరులోని నిర్వాసితులను మాత్రమే తరలిస్తామని సీఎం జగన్ చెప్పడంలోని ఆంతర్యం ఏమిటనే ప్రశ్న వస్తోంది. అంటే.. మిగతా 4 మీటర్ల పరిధిలో ఉన్న నిర్వాసితులను ముంపునీటిలో ముంచేస్తారా? అనే ఆందోళన నిర్వాసితుల్లో వస్తోంది. ఒక పక్కన ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గించం అంటారు. మరో పక్కన 41.15 మీటర్ల కాంటూర్ లోని నిర్వాసితులను మాత్రమే తరలిస్తామంటారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించకపోయినా.. నీటి నిల్వను 41.15 మీటర్ల ఎత్తుకు మాత్రమే పరిమితం చేస్తామని జగన్ రెడ్డి సర్కార్ అంగీకరించినట్లు అయిందంటున్నారు. అంటే.. ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకుంటున్న పోలవరం ప్రాజెక్టును ఒక బ్యారేజి స్థాయికి దిగజార్చేస్తారా? అనే అనుమానం పలువురిలో కలుగుతోంది. పోలవరం ప్రాజెక్టు బ్యారేజి స్థాయికి దిగజార్చితే.. అందులో 194.6 టీఎంసీలకు బదులుగా కేవలం 120 టీఎంసీలను మాత్రమే నిల్వచేసే వీలు ఉంటుందంటున్నారు. ఇది పునరావాస వ్యయం తగ్గించుకోడానికి జగన్ రెడ్డి సర్కార్ వేసిన ఎత్తుగడ అనేది నిపుణుల అభిప్రాయం.
పోలవరం ప్రాజెక్టులో 194.6 మీటర్ల టీఎంసీల నీరు నిల్వ చేయాలంటే కాంటూరులోని లక్షా ఆరు వేల కుటుంబాలను తరలించాలి. వారికి సహాయ పునరావాసం వ్యయం సుమారు 30 వేల కోట్ల రూపాయలు అవుతుంది. అయితే.. కాంటూరును 41.15 మీటర్ల పరిధికే పరిమితం చేస్తే 20 వేల 496 కుటుంబాలను తరలిస్తే సరిపోతుంది. అంటే ఐదు రెట్ల తక్కువ మందికి సహాయ పునరావాస ఖర్చును సరిపెట్టేయవచ్చనేది వైసీపీ సర్కార్ ఎత్తుగడ అనే విమర్శలు వస్తున్నాయి. పోలవరం కాంటూరును 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేస్తే ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నీరు అందే అవకాశం లేదని, ఎత్తిపోతలే దిక్కు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే.. గ్రావిటీ ద్వారా నీటిని తరలించడం సాధ్యం కాకపోగా.. విద్యుత్ ఉత్పత్తి కూడా సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు అనే అర్థాన్ని కోల్పోతుందని, దాంతో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు దెబ్బ తింటాయనేది నిపుణుల హెచ్చరిక. పోలవరం ప్రాజెక్టులో ఒకేసారి గరిష్ఠస్థాయిలో నీటిని నిల్వ చేయడం సాధ్యం కాదనే అంశాన్ని వైసీపీ సర్కార్ తెరమీదకు తేవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ముందుగా 35 మీటర్ల కాంటూరులో నీటిని నిల్వ చేస్తుందట. ఆ తర్వాత 15 రోజులకోసారి మూడు మీటర్ల చొప్పున నీటి నిల్వ ఎత్తు పెంచుతుందట. కానీ ఎంత కాంటూరు మేరకు నీటిని నిల్వ చేస్తుందనేది వైసీపీ సర్కార్ వెల్లడించకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.
పోలవరం జాతీయ ప్రాజెక్టు కనుక దానికి అయ్యే ఖర్చంతా కేంద్రమే భరించాలి. పోలవరం ప్యాకేజి ప్రకటన సమయంలో 2013-14 ఉన్న ధరల ప్రకారం 29 వేల 027 కోట్లే ఇస్తామని కేంద్రం చెబుతోంది. ఆ తర్వాత ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వ్యయానికి కేంద్రం నుంచి అదనంగా నయాపైసాకైనా ఆమోదం తెచ్చుకోలేక పోయిన జగన్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును ఎలా పూర్తిచేస్తారు? ఏ విధంగా వచ్చే ఖరీఫ్ నాటికి నీళ్లిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒక పక్కన పోలవరానికి పెరిగిన ఖర్చు 55 వేల 656 కోట్లు మంజూరు చేయాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నామంటారు జగన్. ఆ పెరిగిన ఖర్చుకు సంబంధించిన నిధులు కేంద్రం ఇస్తుందో ఇవ్వదో తెలియదు. అలా పెరిగిన ఖర్చు నిధులు రాబట్టుకోగల చాకచక్యం జగన్ రెడ్డి సర్కాకు ఉందా..? అనే అనుమానం పలువురిలో కలుగుతోంది. అలా అదనపు నిధులు కేంద్రం నుంచి రాకపోతే ప్రాజెక్టును ఎలా పూర్తిచేస్తారు? ఏ విధంగా నీళ్లు అందిస్తారనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉదయిస్తోంది.


