అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ
Published on: Mon May 11, 2026 3:10PM

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, విభజన హామీల అమలుపై ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరులపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది.
అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి మరింత ఆర్థిక సహాయం అందించాలని చంద్రబాబు కోరారు. అలాగే రాజధాని ప్రాంతంలో మరిన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమరావతిలో కొనసాగుతున్న పనుల పురోగతిని వివరించిన ఆయన, కేంద్ర సంస్థలు వస్తే రాజధాని ప్రాంత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందని అమిత్ షాకు వివరించారు.
రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ప్రాజెక్టు పనులు ఆలస్యం కాకుండా ఉండేందుకు నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని చంద్రబాబు కోరారు.
ఇదే సమయంలో కేంద్ర సహకార శాఖ నుంచి మరింత మద్దతు లభిస్తే రాష్ట్రంలోని రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ చంద్రబాబు సమగ్ర నివేదికను అమిత్ షాకు అందించినట్లు సమాచారం.


