TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తిన్న సీఎం చంద్రబాబు దంపతులు

Published on: Wed May 20, 2026 8:43PM

 

కల్తీ లేదు... కార్బైడ్ లేదు.. పురుగు మందుల గోల లేదు..!

కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన తాటి ముంజలు అంటూ సీఎం ట్వీట్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి కుప్పం పర్యటనలో నిరాడంబరతను చాటుకున్నారు. రోడ్డు పక్కన వాహనాన్ని ఆపి, తాటి ముంజలు కొనుగోలు చేసి ఎంతో ఆప్యాయంగా తింటూ వ్యాపారితో ముచ్చటించారు. రహదారి పక్కన తాటి ముంజలు అమ్ముతున్న ఒక సామాన్య వ్యాపారిని చూసి సీఎం చంద్రబాబు దంపతుల వాహనం అక్కడే ఆగింది. ముఖ్యమంత్రి, ఆయన సతీమణి స్వయంగా కారు దిగి సదరు వ్యాపారి వద్దకు వెళ్లారు. 

ఎంతో సాధారణంగా అక్కడే నిలబడి తాటి ముంజలను కొనుగోలు చేసి, వాటిని రుచి చూస్తూ ఎంతో ఆప్యాయంగా ఆస్వాదించారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రే తన వద్దకు వచ్చి సాదాసీదాగా మాట్లాడటంతో ఆ తాటి ముంజల వ్యాపారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈ సందర్భంగా ఆ వ్యాపారి కుటుంబ పరిస్థితులు, వ్యాపారం ఎలా సాగుతోంది, వారి యోగక్షేమాల గురించి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి ఎంతో ఓపికగా అడిగి తెలుసుకున్నారు.

కుప్పం ప్రజల మనసుల్లాగే స్వచ్ఛమైనవి: చంద్రబాబు ట్వీట్

ఈ అరుదైన క్షణాలకు సంబంధించిన ఫొటోలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ భావోద్వేగమైన వ్యాఖ్యలు చేశారు. "కల్తీ లేదు... కార్బైడ్ లేదు.. పురుగుల మందుల గోల లేదు.. మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన, చల్లనైన తాటి ముంజలు రోడ్డు పక్కన ఆగి తింటుంటే ఎంతో హాయిగా ఉంది" అంటూ ఆయన రాసుకొచ్చారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా, రోడ్డు పక్కన ఆగి సామాన్యుడితో ముచ్చటించిన చంద్రబాబు దంపతుల నిరాడంబరతపై స్థానికులు మరియు తెలుగు ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.