క్లినికల్ ట్రయల్స్ వాయిదా
posted on Jul 7, 2020 12:08PM
హైదరాబాద్ నిమ్స్ లో ఈ రోజు నుంచి జరగాల్సిన క్లినికల్ ట్రయల్స్ వాయిదా పడ్డాయి. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) అనుమతి కోసం నిమ్స్ వేచి చూస్తోంది. రెండు మూడు రోజుల్లో ఐసీఎంఆర్ నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉంది. అనుమతి రాగానే ఫేస్ 1, ఫేస్ 2 కింద ఈ క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి.
హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనాను అరికట్టేందుకు కొవాక్సిన్ పేరిట వ్యాక్సిన్ ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ను ఆగస్టు 15వ తేదీ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్ భావిస్తోంది. ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఐసీఎంఆర్ ఇప్పటికే దేశంలోని 12 ఆస్పత్రులను ఎంపిక చేసింది. అందులో హైదరాబాద్లోని నిమ్స్, విశాఖలోని కేజీహెచ్ కూడా ఉన్నాయి.