స్వీట్ సమోసా సృష్టికర్త నివాళి ఫ్లెక్సీ కి 'కరోనా నెగటివ్ సర్టిఫికెట్ '!

చీరాల స్వీట్ సమోసా సృష్టికర్త ఇకలేరనేది ఒక వార్త కావచ్చు సాధారణంగా చదివితే. షేక్ మునీర్ భాయ్ చేసిన ఈ విశ్వామిత్ర సృష్టి -తీపి సమోసా గురించి కోస్తా జిల్లాల్లో చాలా మందికి తెలిసే ఉంటుంది.  తిన్నాక తెలిసింది అది ఎంత అద్భుతమైన సృష్టో. ఆ సృష్టికర్త షేక్ మునీర్ భాయ్ ఏప్రిల్ 3న కాలం చేశారు. ఎటువంటి రిఫ్రిజిరేషన్ లేకుండానే.. ఆరుబయటి వాతావరణంలో రెండు రోజులపాటు చెక్కుచెదరకుండా, రుచి చెదరకుండా వుంటాయి మునీర్ గారి తీపి సమోసాలు. వారి మృతి తెలుగువారి ఆహార వైవిధ్యంలో ఒక లోటని ఫుడ్ ఎక్స్ పర్ట్, రోటి పచ్చడి నిపుణులు అయిన వాసిరెడ్డి వేణుగోపాల్ నివాళులు అర్పించారు. " ఎక్కువ బాధ కలిగించిన అంశం.. మునీర్ భాయ్ కరోనా వైరస్ కారణంగా మరణించలేదని, కరోనా నెగెటివ్ సర్టిఫికెట్టును ఫ్లెక్సీకి జతపరచవలసిన పరిస్థితి ఎక్కువ విచారం కలిగించింది.అంతే మునీర్ భయ్యా.. మేము తోలుమందం వాళ్లం.ముస్లింలందరూ జిహాదీలని, దేశద్రోహులని.. హిందువులందరూ అసలు సిసలైన దేశభక్తులని, జాతీయవాదులని గుడ్డెద్దులాగా, గొర్రెల మందలాగా గుడ్డిగా నమ్మేవాళ్లం.," అంటూ వాసిరెడ్డి వేణుగోపాల్ గుండెలను కదిలించే పోస్ట్ పెట్టారు.