TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చింతకాయల ఝలక్... ఎంపీ మాధవ్‌కు కొత్త చిక్కులు!

Published on: Fri Aug 5, 2022 3:52PM

 ఎంపీ గోరంట్ల మాధవ్ పై తెలుగుదేశం ప్రధాన కార్యదర్వి చింతకాలయ విజయ్ రూ. 50లక్షలకు పరువు నష్టం దావా వేశారు. శుక్రవారం (ఆగస్టు 5) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనీ విషయం తెలిపారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడైన చింతకాలయ విజయ్ ఈ సందర్భంగా మరోసారి గోరంట్ల మాధవ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

అసహ్యకరంగా వీడియోకాల్ లో మాట్లాడటమే కాకుండా.. బుకాయింపు కూడానా అని గోరంట్లపై మండి పడ్డారు. తనపై మీడియా సమావేశంలో ఆరోపణలు చేసినందుకే మాధవ్ పై పరువునష్టం దావా వేసినట్లు చెప్పారు. ఎంపీ హోదాలో ఉన్న గోరంట్ల మాధవ్ చేసిందే దగుల్బాజీ పని.. నగ్నంగా మహిళలో వీడియో కాల్ మాట్లాడుతూ దొరికిపోయిన ఆయన సిగ్గుతో తలదించుకోవలసింది పోయి నా పై ఆరోపణలు చేయడమేమిటని నిలదీశారు.

ఎంత ఎంపీ అయినా.. చట్టం ముందు ఆయన సామాన్యుడేనని చింతకాలయ విజయ్ అన్నారు.  దిక్కుమాలిన పని చేసి తమపై నిందలేయడం దారుణమన్నారు. పవిత్రమైన పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ.. గోరంట్ల మాధవ్ దిక్కుమాలిన పని చేసి దొరికిపోవడమే కాక.. తెలుగుదేశం పార్టీ నేతలపై, మీడియాపై నిందలేయడం సిగ్గుచేటన్నారు. ఎంపీ మాధవ్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి తనకు సంబంధించిన వీడియో బయటకు తెచ్చింది తానే అనడం సరికాదన్నారు. అసలు ఆ వీడియోకు, తనకు ఏం సంబంధమో ఆయనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తికి నీతి, నిజాయితీ అనేవి లేవా అన్నారు. ఒక ఎంపీకి సంబంధించిన ప్రైవేటు వీడియోకు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శికి ఏం సంబంధమో సమాధానం చెప్పాలన్నారు. ఒక పౌరుడిగా, కుటుంబంలోని వ్యక్తిగా, పార్లమెంటు సభ్యుడిగా ఆయన కుటుంబానికి, ఓట్లేసిన ప్రజలకు, దేశానికి సమాధానం చెప్పడం పోయి.. తనను విమర్శించడమేంటి అన్నారు. తాను తప్పు చేయలేదని చెప్తే సరిపోతుందా.. ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిస్తానని చెబుతున్నపుడు.. ఆ పని చేయకుండా భయపడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.

మాధవ్ సుందర ప్రతి బింబాన్ని చూసేందుకు ఎవరికీ అంత గుండె ధైర్యం లేదంటూ ఎద్దేవా చేశారు.  పార్లమెంటులో ఏపీ పరువు తీశారన్నారు. 25 ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా తీసుకొస్తానని వారి నాయకుడు అంటే.. జనం నమ్మి సీట్లిస్తే.. ఇదా ప్రత్యేక హోదా అటూ ప్రశ్నించారు. ఇలాంటి న్యూడ్ వీడియోలేనా వారు తెచ్చే స్పెషల్ స్టేటస్.? ఇదేనా సాధిస్తామన్న రైల్వే జోన్.? ఇవేనా వెనుకబడిన జిల్లాలకు తెస్తామన్న కేంద్ర నిధులు అంటూ ధ్వజమెత్తారు.  ప్రెస్ మీట్ పెట్టి మరీ తన పేరు చెప్పినందుకే పరువునష్టం దావా వేశానని ఆయన స్పష్టం చేశారు.  పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తానన్నారు.  మాధవ్‌పై అధినేత జగన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విజయ్ ప్రశ్నించారు.