TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీఆర్‌ఎస్‌ నేతలపై కేసీఆర్‌కు అనుమానం... అందుకే వాయిదాలు..!

Published on: Wed May 17, 2017 11:37AM

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లయిపోతోంది. కానీ నామినేటెట్‌, పార్టీ పదవులు భర్తీ మాత్రం జరగడం లేదు. పదవుల భర్తీపై ఆశలు పెట్టుకున్న నేతలు... ఎదురుచూసీచూసి అలసిపోతున్నారు. ఎన్నోసార్లు పదవుల భర్తీకి ముహూర్తాలు ఖరారైనా... ఏదో ఒక కారణంగా వాయిదా పడుతుండటంతో ఆశావహుల ఆవేదన కట్టలు తెంచుకుంటోంది. ఉద్యమం కాలం నుంచి కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ను అంటిపెట్టుకుని ఉన్న నేతలు నైరాశ్యంలోకి వెళ్లిపోతున్నారు. ప్లీనరీకి ముందు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేతలకు నామినేటెడ్‌ పదవులు ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇఛ్చారు. నామినేటెడ్‌ పదవులు దక్కనివాళ్లకి పార్టీ పదవుల్లో న్యాయం చేస్తామని చెప్పారు. దాంతో పార్టీ ప్లీనరీ సందర్భంగా పదవుల భర్తీ ఉంటుందని భావించారు. అయితే ప్లీనరీ ముగిసింది...పదవుల భర్తీ మాత్రం జరగలేదు. దాంతో నౌ ఆర్‌ నెవ్వర్‌ అనే భావన గులాబీ లీడర్లలో వ్యక్తమవుతోంది. 
 


కార్యవర్గం, కమిటీలు, అనుబంధ కమిటీలు లేకుండా అన్నీతానై నడుపుతున్నారు గులాబీ బాస్‌. దీనికి తోడు జిల్లా కమిటీలను పూర్తిగా నిర్వీర్యం చేశారు కేసీఆర్‌. జిల్లా కమిటీలకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా... నేరుగా నియోజకవర్గ కమిటీలు వేశారు. అయితే దీని వెనుక పెద్ద స్ట్రాటజీనే ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కని నేతల ప్రాధాన్యతను తగ్గించేందుకే కేసీఆర్‌... పార్టీ పదవులను భర్తీ చేయడం లేదనే టాక్‌ వినిపిస్తోంది. టికెట్లు దక్కని నేతలు... పార్టీ ఫిరాయించే అవకాశం లేకపోలేదని... అందుకే ఫలనా స్థాయి వ్యక్తి పార్టీ మారాడన్న అపవాదు రాకూడదంటే పార్టీలో హోదా లేకపోతే తలనొప్పులుండవని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఎలాగూ పార్టీ బలంగానే ఉండటంతో పార్టీ పదవులు భర్తీ చేయాల్సినంత తొందరలేదనే భావనలో కేసీఆర్ ఉన్నారట.

 

అయితే అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా నామినేటెడ్‌ పదవుల పందేరం మొదలుకాకపోవడంపై గులాబీ నేతలు దిగులు పడుతున్నారు. పదవుల కోసం ఎదురుచూసీచూసి అలసిపోతున్నారు.