యాత్రికులకు సహకరించండి..ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి

వచ్చే నెల 12 నుంచి మొదలుకానున్న కృష్ణాపుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో యాత్రికులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని స్వచ్ఛంద సంస్థలకు, విజయవాడ నగర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. పుష్కర యాత్రికులకు సంపూర్ణ సహకారం అందించి ఆదరించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 10 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ దిగువన పూర్తిగా శాకాహారాన్ని అందించే ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. పుష్కరాలకు ప్రముఖులను ఆహ్వానించే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ సమీక్షా కార్యక్రమలో కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు, పుష్కరాల ప్రత్యేక అధికారి రాజశేఖర్, సమాచార శాఖ కమిషనర్ వెంకటేశ్వర్, ఇంటెలిజెన్స్ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.