గోధన్ న్యా యోజన.. ఆవు పేడ సేకరణకు వినూత్న పథకం

చత్తీస్ ‌ఘడ్ లో రైతుల నుంచి ఆవు పేడ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 'గోధన్ న్యా యోజన' పేరిట ఓ వినూత్న పథకాన్ని ప్రారంభించింది. రోడ్లపై ఆవుల సంచారాన్ని నిరోధించడంతోపాటు, పశువుల పెంపకాన్ని లాభదాయకంగా మార్చడానికి, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం భూపేష్ బాగేల్ చెప్పారు.  

రైతుల నుంచి ఆవు పేడను సేకరించేందుకు ధరను నిర్ణయించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి రవీంద్ర చౌబే అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తున్నట్లు సీఎం తెలిపారు. రైతులు, గోశాల నిర్వాహకుల అభిప్రాయాలు తీసుకొని ఆవు పేడకు ధర నిర్ణయిస్తామని పేర్కొన్నారు. ఆవు పేడ సేకరణకు ధరను జులై 20 న హరేలీ ఫెస్టివల్ లో ప్రకటిస్తామని, ఈ పథకం వల్ల ఆవులను వీధుల్లోకి వదిలివేయరని సీఎం వ్యాఖ్యానించారు. పశువుల యజమానుల నుంచి పేడను కొనుగోలు చేసి దాన్ని ప్రభుత్వం ఎరువుగా మార్చుతుందన్నారు. అధికారులు ఆవు పేడను సేకరించి వర్మికంపోస్టు ఉత్పత్తి చేయాలని సీఎం సూచించారు. వర్మీకంపోస్టు ఎరువును సహకార సంఘాల ద్వారా అటవీ, వ్యవసాయ, ఉద్యానవన, పట్టణాభివృద్ధి శాఖల ప్లాంటేషన్ కార్యక్రమాలకు, రైతులకు విక్రయించేలా చర్యలు తీసుకుంటామని సీఎం భూపేష్ బాగేల్ వివరించారు.