కిరణ్ సర్కార్ పై చెక్ బౌన్స్ కేసులు?
Published on: Mon Apr 9, 2012 6:07AM
చెల్లని చెక్కుల సమస్య ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థల మధ్య సహజం. కాని రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏకంగా ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు కూడా చెల్లకుండా పోయాయి. రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే వరకు రైతుబంధు పథకం కింద మార్కెట్ యార్డులో నిల్వ చేసుకునే సదుపాయం చేస్తుంది. ఈ పథకం కింద రైతులకు రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ కమిటీ రుణాలు మంజూరు చేసి కోట్లాది రూపాయల మేరకు అందజేశాయి. అయితే ఆ చెక్కులను తీసుకుని బ్యాంకులకు వెళ్ళిన రైతులకు ఆ చెక్కులు చెల్లవని బ్యాంక్ అధికారులు చెప్పడంతో ఆశ్చర్యం కలిగింది.
మార్కెట్ కమిటీల అకౌంట్ లో నిధులు లేకపోవడం అందుకు కారణం. ప్రభుత్వం నుంచి జమ కావలసిన నిధులు సకాలంలో జమ కాలేదు. ప్రైవేటు వ్యాపారులు, దళారుల తరహాలోనే అకౌంట్ లో నిధులు లేకుండా మార్కెట్ కమిటీ అధికారులు చెక్కులు విడుదల చేయడం పట్ల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై చెక్ బౌన్స్ కేసులు పెట్టవచ్చా? పెడితే వచ్చే పర్యవసానాలు ఏమిటన్న దానిపై కొంతమంది రైతు నాయకులు న్యాయవాదుల సలహాలు కూడా తీసుకుంటున్నారు.


