రైతుల పోరాటం స్ఫూర్తిదాయకం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న పోరాటం ఒక చరిత్ర అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం నేటికి 150 రోజులు అయిన సందర్భంగా ఆయన ట్వీట్‌ చేశారు. ఈ ఉద్యమంలో కులముద్రలు, అవమానాలు, అరెస్టులు, లాఠీ దెబ్బలు ఇలా ప్రభుత్వం పెట్టిన అన్నిరకాల హింసలను తట్టుకుని రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని కొనియాడారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసం రైతులు 33 వేల ఎకరాల భూములు త్యాగం చేసి రూ.లక్ష కోట్లు సమకూర్చితే.. వైకాపా పాలకులు దాన్ని మట్టిలో కలిపేశారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మి ‘బిల్డ్‌ ఏపీ’ని ‘సోల్డ్‌ ఏపీ’గా మార్చడం అన్యాయమన్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ రైతులు, రైతు కూలీలు, మహిళల పోరాటం స్ఫూర్తిదాయకమని చంద్రబాబు కొనియాడారు. అమరావతి రైతులకు న్యాయం జరిగేవరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు.