ఐదు కోట్ల అల్లూరి సీతారామరాజులు ఒక్కటిగా గర్జించాలి

అల్లూరి సీతారామరాజుని స్ఫూర్తిగా తీసుకొని రాజధాని అమరావతి కోసం ఉద్యమించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జయంతి రోజున అమరావతి ఉద్యమం 200 వ రోజుకి చేరుకోవడంతో.. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ తెలుగు వీర కిశోరం స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను అన్నారు.

"మన్నెం ప్రజల సమస్యలు తనకెందుకులే అనుకుంటే ఈరోజు అల్లూరి సీతారామరాజు గురించి మనం చెప్పుకునేవాళ్ళం కాదు. స్వాతంత్య్ర సమర వీరులలో విప్లవాగ్ని రగిలేది కాదు. అన్యాయం ఎక్కడ జరిగినా అడ్డుకున్నాడు కాబట్టే అల్లూరి మనకు ఆరాధ్యుడయ్యారు." అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

"అమరావతి ఉద్యమంలోనూ అల్లూరి స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలందరూ అందుకోవాలి. అమరావతిలో కానీ మరెక్కడైనా కానీ, ప్రజలకు ద్రోహం చేయాలన్నా, వారి భవిష్యత్తును కాలరాయాలన్నా పాలకులు భయపడాలంటే 5 కోట్ల అల్లూరి సీతారామరాజులు ఒక్కటిగా గర్జించాలి. అప్పుడే అమరావతి రూపంలో మన ఆత్మగౌరవం నిలబడుతుంది." అని చంద్రబాబు పేర్కొన్నారు.