ఏపీలో కొత్త పథకం..సాగుకు సాయం

 

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబు కొత్త కొత్త పథకాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. మొన్నటికి మొన్న వృద్ధాప్య, వికలాంగ, ఇతర సామాజిక పింఛన్లను రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా రైతుల మన్నన పొందేందుకు మరో కొత్త పధకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్దమవుతున్నారట. రైతులు పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి సొమ్ముకోసం వెతుక్కునే అవసరంలేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం రైతుకు నేరుగా కొంత ఆర్థికసాయం చేయాలన్న ఉద్దేశంతో ఉంది. తెలంగాణలో ‘రైతు బంధు’ పేరిట పెట్టుబడి సహాయం అందిస్తున్నారు. దీనికంటే మెరుగ్గా... భూమిని స్వయంగా సాగుచేసుకునే వారితోపాటు, కౌలుకు తీసుకున్న రైతులకూ సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఎకరాకు ఎంత మొత్తం ఇవ్వాలి, దీనికి సంబంధించిన విధి విధానాలు, పథకం పేరును ఖరారు చేయాల్సి ఉంది. 

భూ యజమానులకే కాకుండా... కౌలు రైతులకు కూడా మేలు చేసేలా పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. రైతే భూమిని సాగు చేసుకుంటూ ఉంటే నేరుగా ఆయనకే లబ్ధి చేకూరుస్తారు. ఒకవేళ కౌలుకు ఇచ్చి ఉంటే... సహాయాన్ని ఇద్దరి మధ్య పంచితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఇలా చేస్తే ఇద్దరికీ ఊరటగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌పుట్‌ సబ్సిడీ, విత్తనాలు, ఎరువుల సరఫరా, పశుపోషణకు సాయం, సాగునీరు, కేంద్ర ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా మద్దతు ధరతో పంటల కొనుగోలు, రుణమాఫీ వంటి పథకాలు, చర్యల ద్వారా రైతులకు అండగా ఉంటున్నామని, ఇంకా ఏం చేస్తే బాగుంటుందో పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ క్రమంలోనే రైతుకు పెట్టుబడి సహాయం అందించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. దీనిపై ఈనెల 21న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించి, ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచే రైతుకు పెట్టుబడి సహాయం చేయాలని దాదాపుగా నిర్ణయించినట్లు తెలిసింది.