తెలుగునాట రామరాజ్యాన్ని నెలకొల్పుదాం! ఎన్టీఆర్ కు చంద్రబాబు నివాళి 

దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నేతలు ఆయనకు ఘనంగా నివాళి అర్పిస్తున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద టీడీపీ అధినేత‌ చంద్రబాబు, ఆ పార్టీ నేత‌లు నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్‌ను కొనియాడారు చంద్రబాబు.  రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చి, కోట్లాది జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని కీర్తించారు. బడుగు బలహీనవర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది ఎన్టీఆర్ అని చంద్రబాబు చెప్పారు. పేదలకు ఆహారభద్రత, నివాస భద్రత, కట్టుకోడానికి మంచి వస్త్రం అందించిన సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ అన్నారు చంద్రబాబు.  తెలుగువారి ఆత్మగౌరవాన్ని, కీర్తిని ప్రపంచానికి చాటిన స్వర్గీయ నందమూరి తారకరామారావు మనకు దూరమై 25 సంవత్సరాలు అయినా ఆ విశ్వవిఖ్యాతుడు మన కళ్ల‌ముందే కదలాడుతున్నట్టు ఉంది.. తెలుగునాట రామరాజ్యాన్ని తిరిగి నెలకొల్పడమే ఎన్టీఆర్ కు మనం అందించే అసలైన నివాళి' అంటూ చంద్ర‌బాబు నాయుడు ట్వీట్ చేశారు. 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా  మహానేత ఎన్టీఆర్ ను  గుర్తు చేసుకున్నారు. అరవై ఏళ్ళ వయసులో రాజకీయాల్లోకి వచ్చి సంచలన విజయాలతో, సంక్షేమ పాలనతో చరిత్ర సృష్టించారని చెప్పారు. ‘‘సామాన్య రైతుబిడ్డగా పుట్టి వెండితెర దేవుడై వెలిగి మనిషి ఎదగడానికి పట్టుదల, కృషి ఉంటే చాలని నిరూపించారు. అరవై ఏళ్ళ వయసులో రాజకీయాల్లోకి వచ్చి సంచలన విజయాలతో, సంక్షేమ పాలనతో చరిత్ర సృష్టించి ఏదైనా సాధించడానికి వయసుతో పనిలేదని, చిత్తశుద్ధి ఉంటే చాలని నిరూపించారు.. దటీజ్ ఎన్టీఆర్. మహిళలకు ఆస్తిహక్కు కల్పించినా, బడుగు బలహీన వర్గాలకు పాలనాధికారాలు అప్పచెప్పినా, పేదలకు వినూత్న సంక్షేమ పథకాలు అందించినా  సమసమాజ స్థాపనే ఎన్టీఆర్ గారి లక్ష్యం. ఆయన కీర్తిశేషులై 25 ఏళ్ళు అయ్యాయంటే నమ్మశక్యంగా లేదు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మానవతావాది ఆశయసాధనకు పునరంకితమవుదాం’’అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.