బెట్టింగ్ లు నిర్వహించడం కాదు.. పరిపాలన చేయడం నేర్చుకోండి!!

 

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తీరువల్లే పోలవరం పూర్తికాలేదని, కాఫర్ డ్యాం వల్లే గ్రామాలు మునిగిపోతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబు ట్విట్టర్ లో స్పందించారు. 

"పోలవరంలాంటి ప్రాజెక్ట్ కట్టడం అంటే, కాంట్రాక్టర్లను బెదిరించడం, బెట్టింగ్ లు నిర్వహించడం అంత సులభం అన్నట్టుగా కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. కాఫర్ డ్యాం కట్టటం వల్లే, ఈ రోజు గ్రామాలు మునిగిపోయాయంటూ కొత్తగా ఇరిగేషన్ పాఠాలు చెబుతున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రతి విషయంలో టెక్నికల్ కమిటీలు ఉంటాయి. కేంద్ర పర్యవేక్షణ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ,  కేంద్ర జలవనరుల కమిషన్(CWC) నిబంధనల ప్రకారం నిర్మాణం ఉంటుంది. ఇంజనీర్లు, అనుభవజ్ఞులు ఎంతో ఆలోచించి, కష్టపడి డిజైన్లను అందిస్తారు. ఈ విషయాలను సదరు  మేధావులు తెలుసుకోవాలి." అని విమర్శించారు.

"గోదావరి వరద వస్తుందని, ప్రభావిత గ్రామాలను ఖాళీ చేయించాలని రెండు నెలల ముందే పోలీస్, రెవిన్యూ యంత్రాంగాలను అధికారులు అప్రమత్తం చేశారు. మరి ఈ మేధావులు ఇన్నాళ్ళూ ఏం చేశారు? మీకు చేతకాని ప్రతి పనికీ నన్ను చూపించడం మాని, ఇప్పటికైనా పరిపాలన ఎలా చెయ్యాలో నేర్చుకోండి." అని బాబు ఎద్దేవా చేసారు.