భూమాను బెంబేలెత్తించిన చంద్రబాబునాయుడు
Published on: Wed May 2, 2012 9:54AM
మాజీ ఎంపి భూమా నాగిరెడ్డి అంటే కర్నూలుజిల్లా వాసులకు హడల్. ఆయనతో గొడవపెట్టుకోవడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. ఆళ్లగడ్డలో అయితే భూమానాగిరెడ్డి చెప్పినదే వేదం. అటువంటి భూమా నాగిరెడ్డిని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు బెంబేలెత్తిస్తున్నారు. కర్నూలుజిల్లాలో తమ పార్టీకి నాగిరెడ్డి కానీ, అతని అనుచరులు కానీ హాని తలపెడితే వారి అంటూ చోస్తానని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా నాగిరెడ్డి హత్యారాజకీయాలు, దౌర్జన్యాలు పేట్రేగిపోయాయని చంద్రబాబు అంటూ ఇకపై ఆయన ఆటలు సాగవని అన్నారు. సామాన్య కుటుంబానికి చెందిన నాగిరెడ్డి హత్యలు, భూకబ్జాలతో ఎదిగారని చంద్రబాబు విమర్శించారు. నిజానికి చిన్న రౌడీగా ఉన్న భూమానాగిరెడ్డికి రాజకీయ ఆశ్రయం కల్పించింది తెలుగుదేశంపార్టీయే.
ఆ పార్టీ అండదండలతో ఎదిగిన తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన పార్టీలో ఉన్నప్పుడు భూమా నాగిరెడ్డి చేసిన అరాచకాలు చంద్రబాబు నాయుడుకు కనిపించలేదు. కానీ, ఆయన వేరే పార్టీకి వెళ్ళినప్పుడు మాత్రం నాగిరెడ్డి అరాచకాలు ఎత్తిచూపుతున్నారు. నిజానికి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బిక్కుబిక్కు మంటూ కాలంగడుపుతున్న తెలుగుదేశం తమ్ముళ్లలో ఆత్మస్థైర్యం నింపేందుకే చంద్రబాబు భూమా నాగిరెడ్డిపై విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


