40 దేశాలు.. 200 నగరాలు.. ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు..
Published on: Tue Mar 29, 2022 12:11PM
టీడీపీ 40 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. పార్టీ ఎన్నారై విభాగాల ఆధ్వర్యంలో 40 దేశాల్లోని 200 నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడిన పార్టీ అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో టీడీపీ పుట్టిందని.. తెలుగు చరిత్ర అంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు.. ఆ తర్వాత అని చదవాల్సిందేనని పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు.
సంక్షేమానికి ఆద్యుడు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని.. పటేల్, పట్వారీ వ్యవస్థలను ఆయన రద్దు చేశారని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆహార భద్రత విధానాన్ని రూ.2కే కిలోబియ్యం పథకంతో ఎన్టీఆర్ ఎప్పుడో అమలు చేశారని చంద్రబాబు కొనియాడారు.
ఎన్టీఆర్ ఆశయాలు.. ఆలోచనలకు అనుగుణంగా పార్టీ బలోపేతం కానుందన్నారు. తెదేపాను స్థాపించిన ముహూర్త బలం గొప్పదని.. అందుకే ఎన్ని ఆటు పోట్లు వచ్చినా తట్టుకుని నిలబడుతోందన్నారు. పార్టీని ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తోందని చెప్పారు. ఏ దేశంలో ఉన్నా రాష్ట్ర భవిష్యత్కు ఎన్ఆర్ఐలు సహకరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.



