జగన్‌ను చూస్తే అసలు భూమి ఇచ్చేవారా?

 

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్, కేసీఆర్, మోదీలపై విమర్శలు గుప్పించారు. తనను చూసి రాజధానికి రైతులు భూములు ఇచ్చారని, అదే జగన్‌ను చూస్తే అసలు భూమి ఇచ్చేవారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేతిలో జగన్‌ జుట్టు ఉందని, అందుకే ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నారని విమర్శించారు. లోటస్‌పాండ్‌లో ఉంటూ ఇద్దరూ కుట్రలు పన్నుతున్నారన్నారు. చివరికి అఫిడవిట్‌కు స్టాంప్‌ పేపర్లను కూడా జగన్‌ హైదరాబాద్‌లో కొన్నారని ఎద్దేవాచేశారు. మోదీ, కేసీఆర్‌ కుమ్మక్కై మనపైకి వస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా తననేమీ చేయలేరన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యతో తనకు సంబంధం ఉందన్నట్టు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తాము హత్యలు చేయబోమని.. హత్యలు చేసిన వారి గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించారు. 32 కేసులు పెట్టుకొని జగన్‌ ఏమీ ఎరగనట్టు నటిస్తున్నారని విమర్శించారు. 31 కేసులున్న నాయకుడు మనకి కావాలా? అని ప్రశ్నించారు.

‘దేశంలో ఎక్కడా లేని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. కష్టపడి హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే ఆంధ్రావాళ్లు ద్రోహులని ప్రచారం చేశారు. ఆస్తులను లాక్కుని ఇక్కడికి పంపించారు. ఆస్తుల్లో వాటా ఇవ్వలేదు. అయినా సహించాం. తెలంగాణలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఎక్కడున్నాయి? ఇక్కడ మేం కట్టిన ఇళ్లు చూడండి. రైతులకు తెలంగాణ లక్ష రూపాయలు చేస్తే మనం లక్షన్నర మాఫీ చేశాం. నాలుగో, ఐదో విడత రుణమాఫీ సొమ్మును ఎన్నికల్లోపు ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కౌలు రైతులను కూడా ఆదుకుంటున్నాం. పేదల పెళ్లిళ్ల బాధ్యత కూడా తీసుకున్నాం. రూ.5కే భోజనం అందిస్తున్నాం’ అని చంద్రబాబు చెప్పారు.