నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్ గా వైసీపీ

 

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు పార్టీ నేతలతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అభ్యర్థుల లిస్ట్ నేరగాళ్లతో నిండిపోయిందని విమర్శించారు. ఎన్నికలకు వైసీపీ ప్రకటించింది అభ్యర్థుల ప్రకటనా? లేదా నేరగాళ్ల ప్రకటనా? అని నిలదీశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ నేరగాళ్ల పార్టీతోనని అన్నారు. మైండ్ గేమ్స్ తో పాటు, సైకో గేమ్స్ లోనూ జగన్ దిట్ట అని విమర్శించారు. అభ్యర్థుల ప్రకటనతోనే ఆపార్టీ ఎలాంటిదో అర్థమవుతోందంటూ మండిపడ్డారు. అటు, ఇటు నేరగాళ్లతో జగన్ అభ్యర్థుల ప్రకటన ఉందని దుయ్యబట్టారు. ఒక వైపు నందిగం సురేష్, మరోవైపు ధర్మాన ప్రసాదరావును పెట్టుకుని మధ్యలో 12 చార్జిషీట్లలో ఏ1 నిందితుడు జగన్ ఉన్నాడని విమర్శించారు. నందిగం సురేష్ అరటి తోటలు తగులపెట్టిన కేసుల్లో ఉన్నాడని గుర్తుచేశారు. కన్నెధార గ్రానైట్ కొండలు తవ్వేసిన నిందితుడు ధర్మాన ప్రసాదరావు అని ఆరోపించారు. నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్ గా వైసీపీ మారిందని దుయ్యబట్టారు.

దొంగ సర్వేలతో ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించినా, ఎన్ని కుట్రలు పన్నినా టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.  అందరి అభిప్రాయాలు తీసుకుని గెలుపు గుర్రాలనే ఎంపిక చేశామని అన్నారు. ప్రజల్లో టీడీపీ పట్ల ఉన్న సానుకులతను ఎవరూ తగ్గించలేరని స్పష్టం చేశారు. సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని పథకాల లబ్ధిదారులు కసి, పౌరుషంతో ఉన్నారని.. దీంతో వైసీపీకి ఓటమి భయం వెంటాడుతోందని అన్నారు. దిక్కు తోచని స్థితిలో ఎంతటి అరాచకాలకైనా వైసీపీ సిద్ధమవుతోందని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.