చరిత్రలో ఇవాళ బ్లాక్ డే.. ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు
posted on Jan 20, 2020 10:37AM
ఏపీకి మూడు రాజధానులు ప్రతిపాదిస్తూ హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మూడు రాజధానులను ఒప్పుకోబోమని చంద్రబాబు తెలిపారు. చరిత్రలో ఇవాళ బ్లాక్ డే అని అన్నారు. రైతులకు అన్యాయం చేస్తున్నారని, 33రోజులుగా ఆందోళన చేస్తున్నా మొండిగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్యానించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనేది ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. భావితరాల కోసం పోరాడతామని, అమరావతిని నిలబెట్టుకుంటామని చెప్పారు.
రాష్ట్రం మొత్తం అనధికారికంగా కర్ఫ్యూ విధించారని, ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు, అరెస్ట్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. అరెస్టులు చేయించడమనేది పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఇంతగా బందోబస్తు పెట్టలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని తరలింపును ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించమని చంద్రబాబు స్పష్టం చేశారు.