మీ విధ్వంసాన్ని, ఉన్మాదాన్ని చరిత్ర మరచిపోదు

ప్రజా వేదికను కూల్చి ఏడాది అయిన సందర్భంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ పై విమర్శలు చేశారు. 

"తెలుగుదేశం హయాంలో ప్రజల వినతులు స్వీకరించే వేదికగా, అన్నివర్గాల సమస్యల పరిష్కార వేదికగా 'ప్రజావేదిక' విలసిల్లింది. విద్య, వైద్య సాయం కోసం, సమస్యలు చెప్పుకోడానికి నిత్యం అనేకమంది వచ్చేవాళ్లు. ప్రభుత్వ సాయంతో పాటు, సమస్యల పరిష్కారం పొందేవాళ్లు. అటువంటి ప్రజావేదికను నేలమట్టం చేయడం ప్రజల ఆకాంక్షలను నేలకూల్చడమే, ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే. ముఖ్యంగా ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను కూల్చడం ఒక బాధ్యతా రాహిత్యమైన చర్య. ఆ శిధిలాలను తొలగించకుండా అలాగే ఉంచడం ఒక ఉన్మాద చర్య." అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

"నాటి విధ్వంసానికి, మీ ప్రభుత్వ ఉన్మాద పాలన ప్రారంభానికి ఏడాది అయిన సందర్భంగా తెలుగుదేశం నేతలు మీ చర్యలను ప్రజల దృష్టికి తెస్తుంటే ఉలికి పడుతున్నారెందుకు?" అని ప్రశ్నించారు.

"మీ విధ్వంసకర పాలనను ప్రశ్నించే హక్కు, నిరసించే హక్కు ప్రతిపక్షానికి ఉంది. ఆ హక్కులను హరిస్తూ అరెస్టు చేసిన తెలుగుదేశం నాయకులను వెంటనే విడుదల చేయాలి. మా పార్టీ నాయకులను అరెస్టు చేసినంత మాత్రాన చరిత్ర మీ విధ్వంసాన్ని, ఉన్మాదాన్నీ మరచిపోదు." అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.