ఫోటో మార్ఫింగ్‌, వీడియో కటింగ్‌.. వైసీపీ సంస్కృతి

 

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో పోటీ పడేది నేరస్థులతోనే అన్నారు. ప్రత్యర్థుల నేరచరిత్ర గుర్తుంచుకోవాలని.. హత్యలు, దోపిడీలు, దాడులు ప్రత్యర్థుల సంస్కృతి అని విమర్శించారు. అధికారం కోసం దేనికైనా దిగజారే పార్టీ వైసీపీ అని వ్యాఖ్యానించారు. వాళ్లే సీన్‌ క్రియేట్‌ చేసి దుష్ప్రచారం చేస్తారని అన్నారు. అలాగే ఫోటోలను మార్ఫింగ్‌ చేస్తారని.. వీడియో కటింగ్‌లు చేస్తారని చెప్పారు. అందుకే నేరస్థులతో పోరాటంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు. చేయని తప్పులు తమపై రుద్దుతారని, తప్పులు జరిగేలా స్కెచ్‌లు వాళ్లే వేస్తారని దుయ్యబట్టారు. ఒక కన్ను ఎప్పుడూ ప్రతిపక్షంపై ఉండాలని నేతలతో చంద్రబాబు అన్నారు. రాజధానిలో రూ.లక్ష కోట్ల అవినీతి అని దుష్ప్రచారం చేసిన వైసీపీ.. ఆ వ్యవహారాన్ని తాను ఖండిస్తే వెనక్కి తగ్గిందని గుర్తుచేశారు. రాజధానికి, పోలవరంకు వ్యతిరేకంగా అనేక కేసులు వేశారన్నారు. రాజకీయాల్లో నేరగాళ్లను తెచ్చిన పార్టీ వైసీపీ అని విమర్శించారు. ఓటమి భయంతోనే వైసీపీ కుట్రల మీద కుట్రలు చేస్తోందని, కులాల మధ్య చిచ్చు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, షా, కేసీఆర్‌, జగన్‌ కుమ్మక్కై కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. నలుగురి కుట్రలను ధైర్యంగా ఎదుర్కోవాలని నేతలకు తెలిపారు.