అచ్చెన్నాయుడు ప్రాణాలతో చెలగాటం.. అసలీ అర్థరాత్రి కుట్రలేంటి?

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేత అచ్చెన్నాయుడుని.. రాత్రికి రాత్రి డిశ్చార్జి చేయించి, ఏసీబీ అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. అచ్చెన్నాయుడు ప్రాణాలతో చెలగాటం ఆడే కుట్రలు చేస్తోందని జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.

"అచ్చెన్నాయుడు ప్రాణాలతో చెలగాటం ఆడే కుట్రలు చేస్తోందీ ప్రభుత్వం. అసలు అరెస్టుచేసే ముందురోజే ఆయనకు ఆపరేషన్ జరిగింది. ఆ విషయం చెప్పినా వినకుండా అమానుషంగా వందల కిలోమీటర్లు రోడ్లపై వాహనంలో తిప్పారు. దాంతో గాయం తిరగబెట్టి రెండోసారి ఆపరేషన్ చేయాల్సివచ్చింది. అచ్చెన్నాయుడును ఆస్పత్రి బెడ్ పైనే ప్రశ్నించాలని ఏసీబీ కోర్టు చెప్పింది. నిలబెట్టవద్దు, కూర్చోపెట్టవద్దని కూడా సూచించింది. 10 రోజులు బెడ్‍ రెస్ట్ ఇవ్వాలని డాక్టర్లు చెబితే, జీజీహెచ్ అధికారులపై ఒత్తిడిచేసి, అర్ధరాత్రి డిశ్చార్జ్ చేయాలని చూడటం ఏంటి?" అని చంద్రబాబు ప్రశ్నించారు.

"ఏసీబీ అధికారులు అర్ధరాత్రే అదుపులోకి తీసుకోవాలని చూడటం ఏంటి? అసలీ అర్థరాత్రి కుట్రలేంటి? కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, ఆసుపత్రి వర్గాలపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారు. ఇది కేసు విచారణలా లేదు, బీసీ నేతపై హత్యాయత్నంలా ఉందని ప్రజాసంఘాలే అంటున్నాయి. ఈ కేసులో చూపే అత్యుత్సాహం, వైసిపి ల్యాండ్ మాఫియాపై, 108 అంబులెన్స్ స్కామ్ మీద, ఆవభూముల స్కామ్ పై, ఇసుక మాఫియాపై ఎందుకులేదు? కొందరు పోలీసు అధికారుల విపరీత ప్రవర్తన వల్లే ఉన్నతాధికారులు కోర్టుల ముందు నిలబడాల్సి వస్తోందని నిన్ననే కోర్టులు ఆక్షేపించాయి. అధికారం చేతిలో ఉందికదా అని బీసీ నేత అచ్చెన్నాయుడు విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తే సహించేది లేదు. న్యాయపరంగా మేమూ పోరాడతాం. మీ కుట్రలను అడ్డుకుంటాం." అని చంద్రబాబు పేర్కొన్నారు.