కేసీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరు.. నాటకాలాడొద్దు

 

తిరుపతిలోని తారకరామ మైదానంలో నిర్వహించిన విజయ శంఖారావం ఎన్నికల ప్రచార సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ మీద విమర్శలు గుప్పించారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి మృతిని కూడా వైసీపీ రాజకీయాలకు వాడుకుంటుందోని మండిపడ్డారు. హత్యానంతరం గుండెపోటు అని నమ్మించేందుకు తప్పుడు ప్రచారం చేశారని, దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు మరిన్ని అడ్డదారులు తొక్కారని ధ్వజమెత్తారు. శవపరీక్షలో హత్య అని తేలగానే ఆ నేరాన్ని టీడీపీపై నెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. చిన్నాన్న హత్యకు గురైతే దోషులపై కఠిన చర్యలు తీసుకొనేలా డిమాండ్‌ చేయకుండా జగన్‌ వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో మోదీ ఉన్నారనే జగన్‌ సీబీఐ విచారణ కోరుతున్నారన్నారు. ఈ హత్య ఎవరు చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలన్నారు. ఈ కేసులో దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని స్పష్టంచేశారు.

అవినీతిలో పట్టుబడ్డ వ్యక్తి జగన్‌ను ఎల్లప్పుడూ కాపాడేది ప్రధాని మోదీనే అని విమర్శించారు. ఆంధ్రలో ఫ్యాన్‌..  హైదరాబాద్‌లో స్విచ్.. ఢిల్లీలో కరెంటు ఉటుంది. ఢిల్లీ నుంచి కరెంటు వస్తే, హైదరాబాద్‌లో స్విచ్‌ వేస్తే ఇక్కడ ఫ్యాన్‌ తిరుగుతుంది. ఇలాంటి ఫ్యాన్‌ను ఇక్కడ తిరగనిస్తారా తమ్ముళ్లూ? అని ప్రశ్నించారు. ఫారం-7 ద్వారా మొత్తం 9లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు. ఫారం-7 దరఖాస్తు చేసినవారిని జైలుకు పంపేవరకూ వదిలిపెట్టకూడదన్నారు. ఏపీ డేటాపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చాలా ప్రేమ ఉందని ఎద్దేవా చేసారు. జగన్‌కు డేటా ఇచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. ఇలాంటి నేతలను కాపాడేది ఢిల్లీలో ఉన్న చౌకీదార్‌ మోదీ. ఢిల్లీ, హైదరాబాద్‌ నుంచి కుట్రలు పన్నుతున్నారు అని మండిపడ్డారు. విభజన చట్టంలో రాష్ట్రానికి 18 హామీలు ఇచ్చినా.. ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఐటీ, సీబీఐ, ఈడీలతో అందరిపై దాడులు చేయిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు దేనికీ భయపడరు. కేసీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరు. మా వద్ద నాటకాలాడితే తగిన బుద్ధి చెబుతాం అని చంద్రబాబు హెచ్చరించారు.