కోడెల ఆత్మహత్యపై గవర్నర్‌కు ఫిర్యాదు... జగన్ ప్రభుత్వంపై చర్యలకు డిమాండ్

కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య ఉదంతాన్ని టీడీపీ సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వ వేధింపుల కారణంగానే కోడెల బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపిస్తోన్న చంద్రబాబు... వివిధ స్థాయిల్లో పోరాటానికి సిద్ధమవుతున్నారు. ముందుగా గవర్నర్ ను కలిసి జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అక్రమ కేసులు, తప్పుడు అభియోగాలతో వేధించినందు వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ మూడు నెలల్లో కోడెలపై నమోదైన కేసుల వివరాలను గవర్నర్ కు అందజేయనున్నారు. ముఖ్యంగా కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను గవర్నర్ కు చంద్రబాబు వివరించనున్నారు. అలాగే రాష్ట్రంలో జరుగుతోన్న కక్ష సాధింపు చర్యలు, ప్రతీకార దాడులు, వేధింపులపై ఫిర్యాదు చేయనున్నారు.