చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యే గుసగుసలు !

 

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో పాలక ప్రతిపక్షాలు ఎలా కొట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది ఈరోజు ఒక ఆసక్తికర సన్నివేశం సభలో చోటు చేసుకుంది. అదేంటంటే ప్రతిపక్ష నాయకుడితో అధికార పార్టీ ఎమ్మెల్యే సంభాషించడం ఆశ్చర్యకరంగా మారింది. విపక్ష నేత చంద్రబాబు, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో గుసగుసలాడటం హైలైట్ గా నిలిచింది.

 ఈ ఆసక్తికర అంశానికి ఈరోజు కారణం ఏంటంటే పోలవరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా సభలో ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ పనుల్లో కొంత మేర మాజీ టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కంపెనీకి ఇచ్చారని సాగునీటి వ్యవహారాల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సభలో వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో ఆ మంత్రికి సన్నిహితుడు అయిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డితో విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు గుసగుసలాడారు. 

కాంట్రాక్టర్లకు పార్టీలు ఉండవని మీ పార్టీలోనూ, మా పార్టీలోనూ కాంట్రాక్టర్లు ఉన్నారు కదా అని శ్రీధర్ రెడ్డితో చంద్రబాబు అన్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్టర్లు అన్ని పార్టీల్లో ఉండటం సహజమే అని తెలిపారు. కానీ చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించకుండా కోటంరెడ్డి నవ్వుతూ వెళ్లిపోయారు.