అరుణ్ జైట్లీ మృతి.. దేశానికే తీరనిలోటు

 

కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి పట్ల టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జైట్లీ కోలుకుంటారని ఆశిస్తున్న తరుణంలో మనకు దూరం కావడం దురదృష్టకరమన్నారు. కేంద్రమంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు.

‘‘వాజ్ పేయి, మోదీ మంత్రివర్గాల్లో న్యాయ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణల కోసం కృషి చేశారు. విద్యార్థి సంఘం అధ్యక్షునిగా రాజకీయ జీవితం ప్రారంభించిన జైట్లీ.. ఎంపీగా, కేంద్రమంత్రిగా అంచెలంచెలుగా ఎదిగారు. ప్రముఖ న్యాయకోవిదునిగానే కాకుండా గొప్ప పరిపాలనా దక్షుడిగా పేరొందారు. ఆయన మృతి బీజేపీకే కాకుండా మొత్తం దేశానికే తీరనిలోటు. అరుణ్ జైట్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను’’ అని చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు.