‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్

 

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ సినిమా విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమాపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఈరోజు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో ఈ సినిమా గురించి ప్రస్తావించారు. ఎన్నికల్లో కొత్త తరం ఓటర్లే ఎక్కువని, వారికి ఎన్టీఆర్‌ చరిత్రపై అవగాహన పెంచాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్టీఆర్‌ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని, కుట్రదారుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని అన్నారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తిని అందరూ చాటిచెప్పాలని కోరారు. బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన చిత్రం కథానాయకుడు ఎన్టీఆర్ స్ఫూర్తిని తెలియజేసేలా ఉందని చెప్పుకొచ్చారు. మహానాయకుడు కూడా అలానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తవాలను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్న వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని పరోక్షంగా రామ్ గోపాల్ వర్మను హెచ్చరించారు.