TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విద్వేషం తీరితే చాలు… విదేశమైనా ఫర్వాలేదు!

Published on: Mon May 8, 2017 12:40PM

 

రాజకీయంలో లాభం,నష్టం వుంటాయి తప్ప… మంచీ, చెడూ వుండవు! రాజకీయ ఎత్తులు, పై ఎత్తుల్లో భాగంగా ఒక్కోసారి కొందరు అత్యుత్సాహపరులు దేశం పరువు కూడా తీస్తుంటారు. అలాంటి సంఘటన తాజాగా చంద్రబాబు అమెరికా పర్యటన నేపథ్యంలో జరిగింది. ఇక్కడ మన దేశంలో వుండగా మనకు ఎన్ని విభేదాలైనా వుండవచ్చు. ఎన్ని విద్వేషాలున్నా కూడా ఫర్లేదు. కాని, దేశం కాని దేశంలో మన రాజకీయాలు, శత్రుత్వాలు బయటపెట్టుకుంటామా? ప్రపంచం ముందు మన పరువు మనమే తీసుకుంటామా? కొందరు అలాంటి దిగజారుడు పనికి కూడా సిద్ధమయ్యారు!

 

వైసీపీ సపోర్టర్స్ గా భావిస్తున్న వారు కొందరు డాలస్ రాష్ట్రంలోని ఇర్వింగ్ నగరంలో పర్యటిస్తున్న ఏపీ సీఎంపై కంప్లైంట్ చేశారు! ఎవరికో తెలుసా? ఆ అమెరికన్ నగరపు మేయర్ కి! ఒక తెలుగు ముఖ్యమంత్రిపై ప్రవాస తెలుగు వారే అమెరికన్ మేయర్ కి కంప్లైంట్ చేయటం ఎంత సిగ్గుచేటు? పైగా ఈమెయిల్స్ రూపంలో పంపిన తమ అబద్ధపు మాటల్లో… వారు చంద్రబాబును ఎర్ర చందనం స్మగ్లింగ్ కోసం పాతిక మందిని చంపించిన క్రిమినల్ గా అభివర్ణించారు! ఆయన అమెరికాకి వచ్చింది కూడా చట్ట వ్యతిరేకంగా నిధుల సేకరణ కోసమని చెప్పారు!

 

ఒక సీనియర్ నేత, ప్రజల చేత ఎన్నుకోబడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి అబద్ధం చెప్పటమే దుర్మార్గం. దానికి తోడు అంతర్జాతీయ సమాజం ముందు తల దించుకునేలా అమెరికాలోని ఒక నగర మేయర్ కి కంప్లైంట్ చేయటం… మరింత విషాదం! మొత్తానికి సదరు దుర్మార్గ మెయిల్స్ ప్రభావంతో చంద్రబాబు మీటింగ్ వద్దకొచ్చిన పోలీసులు జరిగేది వేరని అర్థం చేసుకుని సైలెంట్ గా వుండిపోయారట. చంద్రబాబు ఇండియాలోని ఒక సీఎం అని గ్రహించి వారు ప్రత్యేకమైన భద్రత కూడా కల్పించారట!

 

మెయిల్స్ చేసిన వారు నిజంగా వైసీపీ మద్దతుదారులో కాదో మనకు తెలియదు. కానీ, వారెవరైనా… చంద్రబాబుతో తమకు వైరం వుంటే ఇండియాలో తేల్చుకోవాలి. అమెరికాలో ఆయన్ని రచ్చకీడ్చాలని ప్రయత్నించటం అత్యంత హేయం. ఎందుకంటే, చంద్రబాబుకు అవమానం జరగటం కేవలం ఆయనకు వ్యక్తిగత నష్టం కాదు. ముఖ్యమంత్రి హోదాలో విదేశీ పర్యటన చేస్తున్న ఎవరు అరెస్ట్ అయినా అది మన యావత్ జాతికే అవమానం! గతంలో ఇలాంటి సిగ్గుమాలిన పనికే చాలా మంది ఎంపీలు కూడా పాల్పడ్డారు. మోదీని అమెరికాలోకి రానివ్వద్దని ఒబామాకి అభ్యర్థన చేసుకున్నారు. కేవలం స్వంత రాజకీయ లబ్ది తప్ప ఇలాంటి వారికి దేశ గౌరవం, రాష్ట్ర ప్రతిష్ట వంటివేవీ పట్టవు. ఇలాంటి వార్ని కఠినంగా శిక్షించే చట్టాలు ఏమైనా తీసుకొచ్చే ఆలోచన చేయాలి రాజ్యాంగ నిపుణులు, ప్రభుత్వాలు…