బీజేపీతో తెగదెంపులు... చంద్రబాబు నిర్ణయం....!

 

బడ్జెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందని కాస్త రాజకీయ అనుభవం ఉన్న ఎవరిని అడిగినా చెబుతారు. ఇక కేంద్రం చేసిన ఈ పనికి రాజకీయ నేతలతో పాటు, సామాన్య ప్రజలుసైతం బీజేపీపై మండిపడుతున్నారు. ఇక మిత్రపక్షంగా ఉన్న టీడీపీ అయితే బీజేపీతో తెగదెంపులు చేసుకుందామని చూస్తుంది. ఈ వియషంలో ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ... పార్టీనేతలు మాత్రం బీజేపీతో పొత్తు తెంచుకోవాల్సిందే అని అంటున్నారట. అంతేకాదు.. ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధపడి, ఆ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు వద్ద చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఈ ఉదయం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై అనుసరించాల్సిన వ్యూహాల గురించి, ఎంపీలు, ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం కానుండగా, ఇప్పటికే పలువురు ఎంపీలు, మంత్రులు తమ అభిప్రాయాలను ఆయనకు చేరవేసినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎంపీ పదవులకు రాజీనామా చేస్తే, ప్రజల్లో ప్రతిష్ఠ పెరుగుతుందని కొందరు చంద్రబాబుకు స్పష్టం చేశారని, బీజేపీతో పొత్తు వద్దని, వెంటనే తెగదెంపులు చేసుకుందామని అత్యధిక మంత్రులు అంటున్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. కాగా, నేటి సమావేశంలో కీలక నిర్ణయం వెలువడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి...