చంద్రబాబు వ్యాఖ్యలు... టీడీపీ నేతల్లో గుబులు...


ఏ  విషయాన్నైనా నిర్మొహమాటంగా చెప్పడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుంటారు. నవ్వుతూనే నేతలకు కానీ, అధికారులకు కానీ చురుకలు అంటిస్తుంటారు. తాజాగా అలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే నేతల్లో గుబులు రేపుతున్నాయట. అవేంటంటే.. తదుపరి ఎన్నికల్లో మొహమాటాలకు పోయి ఎవరికీ టికెట్లు ఇచ్చే పరిస్థితి తెచ్చుకోబోనని చంద్రబాబు చెప్పారట. ఇక పదవుల వద్ద సాన్నిహిత్యాన్ని చూడబోనని, సన్నిహితులని భావిస్తే, ఇంటికి పిలిచి అన్నం పెడతానే తప్ప, టికెట్లు ఆఫర్ చేయబోనని స్పష్టం చేశారు. ఇంట్లోనే కూర్చుని పదవులు అనుభవిస్తున్న వారికి ఇకపై పదవులు రావని, అందరినీ కలుపుకుని, పేరు తెచ్చుకుంటేనే పదవులు వరిస్తాయని అన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి కేవలం పార్టీ ఇస్తున్న సమాచారంపై మాత్రమే ఆధారపడటం లేదని, తనకున్న వివిధ మార్గాల ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని దాన్ని సమీక్షిస్తున్నానని, దాని ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటానని వెల్లడించారు. దీంతో ఇప్పుడు నేతల గుండెల్లో గుబులు పట్టుకుందట. మరి చూద్దాం ఏం జరుగుతుందో...