నవ్యాంధ్ర పునర్నిర్మాణమే ధ్యేయం: చంద్రబాబు

 

స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తితో, నవ్యాంధ్ర నిర్మాణమే ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలులో ఏర్పాటు చేసిన 68వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. ‘‘స్వాతంత్ర్య పోరాటంలో ఆంధ్రులు త్యాగాలు స్ఫూర్తిదాయయం. రాష్ట్రంలో గతంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో పోల్చితే రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో జరుగుతున్న నేటి స్వాతంత్ర్య దినోత్సవానికి ఎంతో ప్రత్యేకత వుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడిన దుష్పరిణామాల నుంచి కోలుకోవడానికి అందరూ కార్యదీక్షతో పనిచేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు. 15 వేల కోట్ల ఆర్థిక లోటుతో కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని ఈ పరిస్థితిని సాధ్యమైనంత త్వరగా అధిగమించడానికి కృషి చేయాలని ఆయన కోరారు. రౌతుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తుందని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా వివరించారు.