TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ మంత్రులకు త్వరలో మూడనుందా?

Published on: Thu Mar 5, 2015 2:40PM

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం అంటే అది అందరి వల్ల అయ్యే విషయం కాదు. ఆలోచనల్లోగానీ, ఆచరణలోగానీ చంద్రబాబుతో సమానంగా కాకపోయిన ఆయనకు సంతోషం కలిగించే స్థాయిలో అయినా పని చేయగలగాలి. అలాంటి వారికే చంద్రబాబు నుంచి గౌరవం లభిస్తుంది. ఏదో ఆషామాషీగా వుండేవారికి పదవులు గట్రా దక్కినా ఆ తర్వాత అవి ఎలాగూ ఊడిపోతాయి. ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో వున్న కొంతమంది మంత్రుల పరిస్థితి ఇలాగే వుంది. చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి ‘రిజర్వేషన్లతో’ మంత్రిపదవులు పొందిన కొంతమంది చంద్రబాబు నాయుడు ఆశించిన విధంగా పనిచేయడం లేదు. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని గమనించారు. పాత చంద్రబాబు అయితే వీరిని ఏనాడో ఇంటికి పంపించి వుండేవారు. కాకపోతే ఇప్పుడు ఆయన తన ‘కరడుగట్టిన క్రమశిక్షణ’ను కొంత సడలించుకున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా పదవుల్లో వున్నారు. తన అంచనాలకు తగ్గట్టుగా పని చేసి తీరాల్సిందేనని, మీ పని తీరు మార్చుకోవాల్సిందేనని చంద్రబాబు ఆ మంత్రులకు ఎప్పుడో వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ కొంతమంది మీద పనిచేసింది. కొంతమంది ఎన్ని తంటాలు పడినా చంద్రబాబు అంచనాలకు చేరుకోలేక సతమతమైపోతున్నారు. మరికొందరు అలాంటి ప్రయత్నాలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు వున్నారు. అలాంటి వారికి త్వరలో భారీ షాక్ తగలబోతోంది.

 

ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత సదరు మంత్రివర్యుల మీద వేటు వేసే అవకాశం వుందని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో తమ సత్తా నిరూపించుకున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లాంటి నాయకులు మంత్రి పదవులు లేకుండా వున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో వున్న ప్యాసింజర్ రైళ్ళ లాంటి వారిని లూప్ లైన్లో పెట్టేసి ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్ళకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బుధవారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరి నుంచి వారి వారి శాఖలకు సంబంధించిన సమాచారాన్ని తీసుకున్న తర్వాత, ఈమధ్యకాలంలో వారు పనిచేసిన తీరును తెలుసుకున్న తర్వాత చంద్రబాబు సదరు మంత్రుల విషయంలో ఇక లాభం లేదనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రివర్గ విస్తరణ చేసి, మార్పులు చేర్పుల్లో భాగంగా ‘ప్యాసింజర్ మంత్రులు’ అందరికీ విశ్రాంతి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.