TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రజనీకి అంత సీనుందా?.. మంత్రి ప‌ద‌వి ద‌క్కేనా?

Published on: Tue Apr 5, 2022 2:52PM

ఏప్రిల్ 11న ఏపీ మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణకు దాదాపు ముహూర్తం ఫిక్స్ అయిందనే వార్తలు వస్తున్నాయి. అయితే.. కేబినెట్ రీ షఫిల్ లో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీకి బెర్త్ ఖాయం అనే సమాచారం ఒక్కసారిగా తెర మీదకు వచ్చింది. అయితే.. పల్నాడు ప్రాంతం నుంచే శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా కేబినెట్ బెర్త్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. దీంతో ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే ఏపీ కేబినెట్ రేసులో పల్నాడు ప్రాంతం నుంచి అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడదల రజనీ హోరాహోరీగా పోటీపడుతున్నారు.

వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్ ప్రారంభించినప్పటి నుంచీ అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన వెన్నంటే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ జగన్ బయటికి వచ్చిన వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేసి, ఆయన వెంటే నడిచిన వారిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒకరు. అప్పటి నుంచీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు జగన్ తోనే ఉండడం వారికి మంత్రివర్గం కొత్త కూర్పులో కలిసి వచ్చే అంశం అని రాజకీయ పండితులు చెబుతున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గత కేబినెట్ లోనే మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. అయితే.. వివిధ సమీకరణాల నేపథ్యంలో ఆయనకు అప్పుడు బెర్త్ లభించలేదు. కానీ పిన్నెల్లికి ప్రభుత్వం విప్ పదవి ఇచ్చి సీఎం జగన్ కాస్త చల్లబరిచారనే అనుకోవచ్చు.

ఇక సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా మంత్రి పదవి కోసం ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా అంబటి రాంబాబు నుంచి వైఎస్ జగన్ తొలి నుంచీ విస్తృతంగా సేవలు తీసుకుంటూనే ఉన్నారు. పల్నాడు ప్రాంతం నుంచి అంబటికి కేబినెట్ పదవి లభిస్తే ఆయన మరింత ఉత్సాహంతో తన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేబినెట్ రేసులో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ ఒక్కసారిగా తెరమీదకు రావడం విశేషం. ఇలా విడదల రజనీ కేబినెట్ రేసులోకి ఒక్కసారిగా రావడానికి ఆమె ప్రత్యేకత ఏంటి? అనే ఊహాగానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. రజనీకి ఉన్న డబ్బులా? పలుకుబడా? లేక కరోనా సమయంలో రజనీ చేసిన సమాజ సేవా? ఇలా రజనీలో ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని సీఎం జగన్ నుంచి మంత్రి పదవి లభిస్తుందనే ఊహాగానాలు సర్వత్రా హల్ చల్ చేస్తున్నాయి.

ఒకవేళ అంబటి రాంబాబును, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కాదని విడదల రజనీనే తన కొత్త మంత్రి వర్గంలోకి సీఎం వైఎస్ జగన్ తీసుకుంటే.. వైఎస్ కుటుంబానికి ఉన్న పేరు సంగతేంటనే సందేహాలు వస్తున్నాయి. తమను నమ్మి.. తమ వెంటే ఉండేవారిని వైఎస్ కుటుంబం ఎప్పుడూ ఆదరిస్తుందని, వారిని మంచి స్థానాల్లో కూర్చోబెడుతుందనే పేరు ఇప్పటి వరకు ఉంది. అలాంటిది తనతో పాటే ఇన్నేళ్లుగా నడుస్తున్న అంబటి రాంబాబుకు మంత్రి పదవి దక్కకపోతే వైఎస్ ఫ్యామిలీ పేరు ఏమవుతుంద‌ని అంటున్నారు. అంబటికి కొత్త కేబినెట్ లో అయినా చోటు కల్పించకపోతే వైఎస్ కుటుంబం లాజిక్ మిస్ అయినట్లే కదా అంటున్నారు. పల్నాడు ప్రాంతం నుంచి అంబటిని, పిన్నెల్లిని కాదని విడదల రజనీకి కేబినెట్లో స్థానం కల్పిస్తే.. ఇప్పటి వరకు వైఎస్ కుటుంబానికి ఉన్న ఇమేజ్ డ్యామేజ్ అయిపోదా? అని రాజకీయ విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెల 11న జరిగే ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో తొలి నుంచీ తనకు మద్దతుగా, చేదోడు వాదోడుగా ఉన్న అంబటి రాంబాబుకు, లేదంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి స్థానం కల్పిస్తారో.. లేక డబ్బే ప్రధానం అంటూ విడదల రజనీకే వైఎస్ జగన్ చోటు కల్పిస్తారో వేచి చూడాల్సి ఉంది.